కడప గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లమో మొదటి ఏడాది విద్యార్థి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందని.. విద్యార్థి సంఘ నాయకులు ఆస్పత్రి ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. యాజమాన్యం స్పందించి మృతుని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతవరకు శవపరీక్షకు అనుమతించమని బైఠాయించారు. అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
సిద్ధవటం మండలానికి చెందిన గణేష్.. గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లమో మొదటి ఏడాది చదువుతున్నాడు. తోటి విద్యార్థులతో కలిసి కళాశాల ఆవరణలో ఈరోజు సాయంత్రం క్రికెట్ ఆడుతుండగా.. మృతుడు బంతి కోసం వెళ్ళాడు. సమీపంలోని నీటి గుంటలో కాలు పెట్టగానే.. అక్కడికక్కడే మృతిచెందాడని మిత్రులు తెలిపారు. సహచరులు హుటాహుటిన వచ్చి పరిశీలించగా.. అక్కడ విద్యుత్ తీగలు ఉన్నాయని పేర్కొన్నారు. వెంటనే అతడిని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లినా ఉపయోగం లేకుండా పోయిందన్నారు.