ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడపలో విమాన సేవలు షురూ

కడప విమానాశ్రయం నుంచి హైదరాబాద్, చెన్నై, విజయవాడకు ట్రూజెట్ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం అయ్యాయని కడప ఎయిర్ పోర్టు అథారిటీ డైరెక్టర్ శివప్రసాద్ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికులకు విమానాశ్రయంలోనే కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కరోనా కేసులు తీవ్రంగా ఉన్న చెన్నై నుంచి వచ్చే ప్రయాణికులను కచ్చితంగా 14 రోజులు క్వారంటైన్​కు పంపిస్తున్నామని స్పష్టం చేశారు. విమానంలో ప్రయాణించాలనుకునే ప్రయాణికులు తప్పనిసరిగా స్పందన వెబ్​సైట్​లో పేర్లు నమోదు చేసుకోవడం సహా ఆరోగ్యసేతు యాప్ డౌన్​లోడ్​ చేసుకోవాలని శివప్రసాద్ తెలిపారు.

కడపలో విమాన సేవలు పునః ప్రారంభం
కడపలో విమాన సేవలు పునః ప్రారంభం

By

Published : May 29, 2020, 9:33 AM IST

లాక్​డౌన్ సడలింపులతో విమానయాన సర్వీసులు తిరిగి ప్రారంభం కావడం వల్ల కడప విమానాశ్రయం మళ్లీ సందడిగా మారింది. కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న తమిళనాడు రాష్ట్రం నుంచి వచ్చే ప్రయాణికులపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చెన్నై నుంచి వచ్చే ప్రయాణికులను తప్పనిసరిగా 14 రోజులు క్వారంటైన్​కు పంపాలని నిర్ణయించారు. ఆ మేరకు 23 మందిని క్వారంటైన్​కు తరలించారు. కరోనా తీవ్రత తక్కువున్న హైదరాబాద్, విజయవాడ నుంచి వచ్చే వారికి మినహాయింపులు ఇచ్చారు.

లాక్​డౌన్ కారణంగా మూతపడ్డ కడప విమానాశ్రయం... సడలింపులతో ఈ నెల 27 నుంచి తిరిగి విమాన సర్వీసులను ప్రారంభించింది. కడప విమానాశ్రయం నుంచి ట్రూజెట్ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. కడప నుంచి చెన్నై, హైదరాబాద్, విజయవాడకు ట్రూజెట్ విమాన సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. నైట్ ల్యాండింగ్ లేకపోవడం వల్ల సాయంత్రం వరకు మాత్రమే ఇక్కడ సర్వీసులు కొనసాగుతున్నాయి.

కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న తమిళనాడు నుంచి కడపకు వచ్చే ప్రయాణికులకు అధికారులు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. 27వ తేదీన చెన్నై నుంచి తొలి ట్రూజెట్ విమాన సర్వీసు కడపకు చేరుకుంది. ఇందులో 23 మంది ప్రయాణికులకు అధికారులు.. విమానాశ్రయంలోనే వైద్య పరీక్షలు నిర్వహించి 14 రోజుల క్వారంటైన్​కు తరలించారు. కరోనా ప్రభావిత రాష్ట్రాల జాబితాల్లో ఉన్న చెన్నై, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చినా వారిని 14 రోజులు క్వారంటైన్ చేస్తున్నారు. ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా విమానాశ్రయంలో ఏర్పాట్లు చేశామని కడప విమానాశ్రయం డైరెక్టర్ శివప్రసాద్ తెలిపారు.

చెన్నై నుంచి కడపకు వచ్చే ప్రయాణికులను 14 రోజుల క్వారంటైన్ చేస్తున్న అధికారులు... విజయవాడ, హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికులను మాత్రం విమానాశ్రయంలో వైద్య పరీక్షలు నిర్వహించి ఇళ్లకు పంపుతున్నారు. గురువారం హైదరాబాద్ నుంచి కడపకు వచ్చిన ట్రూజెట్ విమానంలో మహారాష్ట్ర నుంచి ఓ సాప్ట్​వేర్ ఉద్యోగి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ముంబయి నుంచి హైదరాబాద్... హైదరాబాద్ నుంచి కడపకు ఆ యువకుడు ప్రయాణం చేశారు. ఈ క్రమంలో యువకుణ్ని 14 రోజుల క్వారంటైన్​కు తరలించారు. విమానాశ్రయంలో ప్రతి ప్రయాణికుడికి మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్​ను అధికారులు ఉచితంగా అందిస్తున్నారు.

ఇదీ చదవండి:

కన్నా లక్ష్మీనారాయణ ఇంట్లో విషాదం

ABOUT THE AUTHOR

...view details