ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 19, 2020, 11:05 PM IST

ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు... ఇబ్బందుల్లో ప్రజలు

రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. విస్తారంగా కురిసిన వర్షాలకు... ప్రధాన రహదారులు జలమయమై ప్రజలు అవస్థలు పడుతున్నారు. వేల ఎకరాల్లో పంట మునిగి రైతులు ఆవేదన చెందుతున్నారు. కడపలో కురిసిన వర్షానికి కొవిడ్ కేంద్రంలో రోగులు ఇబ్బందులు పడ్డారు.

రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు... ఇబ్బందుల్లో ప్రజలు
రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు... ఇబ్బందుల్లో ప్రజలు

నెల్లూరు సోమశిల జలాశయానికి ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా నీరు చేరుతుండటంతో జలాశయం నుంచి నీటిని పెన్నా పరివాహక ప్రాంతం గుండా కిందకు వదలుతున్నారు. ఈ కారణంగా సంగం మండలంలోని లోతట్టు ప్రాంతంలో ఉండె వీర్లగుడిపాడు గ్రామం చుట్టూ నీరు చేరడం వల్ల జనాలు నానా అవస్థలు పడుతున్నారు. 120 కుటుంబాల చుట్డూ నీరు చేరడం వల్ల ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అధికారులు వారిని బయటకు తరలించే పనిలో పడ్డారు. పెన్నా పరివాహక ప్రాంతంలో ఉండే అనంతసాగరం, చేజర్ల, కలువాయి, ఆత్మకూరు, సంగం మండలాల్లో సుమారు 20 వేల ఎకరాల్లో కోత దశలో వున్న వరి పంట నీట మునిగింది.

నీటిలో ఇబ్బందులు పడుతున్నప్రజలు

అతి పెద్ద చెరువుగా ప్రసిద్ధి చెందిన ప్రకాశం జిల్లా కంభం చెరువుకు జలకళ సంతరించుకుంటోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు చెరువు క్రమంగా నీటిమట్టం పెరుగుతుంది. ప్రస్తుతానికి 9 అడుగుల మేర నీటి మట్టం చేరుకుంది. చుట్టూ కొండలు, పచ్చని చెట్లు, మధ్యలో నిండుకుండలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది.

నీటితో నిండిిన చెరువు
చెరువులో జలకళ

చినుకు పడితే నడిచేందుకు రహదారిపై సాహసం చేయాల్సిన పరిస్థితి విశాఖ జిల్లా పాయకరావుపేటలో నెలకొంది. పాయకరావుపేట పట్టణ ప్రధాన రహదారి కొంతకాలంగా అభివృద్ధి చేయకపోవడంతో కొద్దిపాటి వర్షానికే చెరువులను తలపించేలా కనిపిస్తున్నాయి. వై కూడలి నుంచి గౌతమ్ థియేటర్ వరకు రహదారిపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. వీటిలోకి నీరు చేరడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సమస్యపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు... ఇబ్బందుల్లో ప్రజలు

కడప జిల్లాలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. విస్తారంగా కురిసిన వర్షాలకు... ప్రధాన రహదారులు జలమయమై ప్రజలు అవస్థలు పడుతున్నారు. వేల ఎకరాల్లో పంట మునిగి రైతులు ఆవేదన చెందుతున్నారు. గండికోట జలాశయానికి భారీగా నీరు చేరగా.... ముంపువాసులను ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారు. కమలాపురం మండలం గొల్లపల్లి వద్ద వరదనీటి ఉద్ధృతికి వంతెన మధ్య పెద్ద గుంత పడటంతో.... బ్రిడ్జి మరింత బలహీనపడింది.

గండికోట జలాశయంలోకి భారీగా వరద నీరు చేరుతుండటంతో.... ముంపు గ్రామాల ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. గండికోట నుంచి 30 వేల క్యూసెక్కుల నీటిని మైలవరం ప్రాజెక్టులోకి వదలగా.... మైలవరం జలాశయంలో 9 గేట్లు ఎత్తి... 35 వేల క్యూసెక్కుల నీటిని పెన్నా నదిలోకి విడిచారు. గండికోట జలాశయం పరిధిలోని తాళ్ల పొద్దుటూరు బీసీ కాలనీలోకి నీళ్లు చేరి స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు బుగ్గవంక ప్రాజెక్టు నిండడం వల్ల అధికారులు నాలుగు గేట్లు ఎత్తి నీళ్లను కిందికి వదిలారు. దీంతో కడప నగరం నడిబొడ్డున ఉన్న బుగ్గవంకలోకి భారీగా వరద ప్రవహిస్తోంది.

కమలాపురంలోని పలు గ్రామాల్లో పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. రాజుపాలెం మండలంలో పొలాల్లో నీరు నిలిచింది. వెంగలాయపల్లె-రాజుపాలెం మార్గమధ్యంలో ఉన్న వంతెనపై వరద నీరు ప్రవహిస్తోంది. జిల్లాలో పాపాఘ్ని, కుందూ, పెన్నా నదులు... పూర్తిగా పొంగి పొర్లడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

కర్నూలులో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జనజీవనం అతలాకుతలమైంది. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపునీరు చేరింది. ప్రజలంతా రోడ్లపైకి వచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా పట్టించుకోవట్లేదని సమతనగర్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. నందికొట్కూరు నియోజకవర్గంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కొన్నిచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లి రహదారులపై నుంచి నీరు ప్రవహిస్తోంది. మిడుతూరులో యూరియా బస్తాలు తడిసి ముద్దయ్యాయి. కనాల గ్రామంలో వరి పొలాలన్నీ చెరువులుగా మారాయని.... పెట్టుబడి మొత్తం నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నంద్యాల సమీపంలో చామకాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన నల్లమల అడవుల్లో కురిసిన భారీ వర్షాలకు నీటి ఉద్ధృతి కొనసాగుతోంది. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద చామకాలువ కట్ట కోతకు గురైంది. మరమ్మతులు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మహానంది మండలం బుక్కాపురం వద్ద చెరువు నిండి రహదారిపై నుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఆ దారిన వెళ్తున్న ఓ వాహనదారుడు ప్రవాహంలో కొట్టుకుపోతుండగా స్థానికులు తాళ్ల సాయంతో కాపాడి... వాహనాన్ని బయటకు తీశారు.

బనగానపల్లె మండలం టంగుటూరు సమీపంలో.... అలుగు వాగులో కారుతో సహా కొట్టుకుపోతున్న ఇద్దరిని గ్రామస్థుల సాయంతో నందివర్గం పోలీసులు రక్షించారు. అనంతపురానికి చెందిన భాస్కర్, ఈశ్వర్ రెడ్డి.... కారులో నంద్యాల వెళ్తుండగా వాగులో చిక్కుకుపోయారు. వెంటనే 100కు ఫోన్ చేయగా.... హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను కాపాడారు.

ఇదీ చదవండి:'సీఎం జగన్ మాత్రమే డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నా...'

ABOUT THE AUTHOR

...view details