ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 24, 2021, 5:08 AM IST

ETV Bharat / state

viveka murder case: ఆ కుటుంబానికి వివేకా హత్యపై సమాచారం తెలిసి ఉంటుందా?!

మాజీ మంత్రి వైఎస్​ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ(CBI) వేగం పెంచింది. వరుసగా అనుమానితులను కడపకు పిలిచి విచారణ చేస్తోంది. పులివెందులకు చెందిన ఓ వైకాపా కార్యకర్త కుటుంబాన్ని పదేపదే విచారణకు పిలుస్తుండటం చర్చనీయాంశమైంది. వివేకా కారు డ్రైవర్‌ను మరోసారి విచారణకు పిలిచారు.

cbi enquiry going on viveka murder case
cbi enquiry going on viveka murder case

వివేకా హత్య కేసు(viveka murder case)లో సీబీఐ విచారణ వేగంగా సాగుతోంది. వరుసగా 17వ రోజు అనుమానితులను విచారిస్తున్నారు. బుధవారం కూడా వివేకా కారు మాజీ డ్రైవర్‌ దస్తగిరిని విచారణకు పిలిచారు. ఇతను వివేకా హత్య జరగడానికి ఆరు నెలల ముందు డ్రైవర్‌ పని మానుకున్నాడు. వివేకా వద్ద ఎందుకు పని మానుకోవాల్సి వచ్చిందనే కోణంలో అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఇతన్ని దిల్లీకి తీసుకెళ్లిన అధికారులు రెండు నెలల పాటు అక్కడే ప్రశ్నించారు. ఇపుడు వరుసగా విచారణకు పిలుస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

దస్తగిరి నుంచి అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. దస్తగిరిని పులివెందులకు తీసుకెళ్లి వివేకా ఇంటి పరిసరాలను కూడా పరిశీలించి వచ్చారు. ఆర్థిక లావాదేవీలు, భూ తగాదాల కోణంలో విచారించినట్లు తెలుస్తోంది. కడప ఆర్​ అండ్ బీ అతిథి గృహంలో పులివెందులకు చెందిన ఐదుగురు అనుమానితులను సీబీఐ విచారించింది. వైకాపా కార్యకర్త కృష్ణయ్య కుటుంబసభ్యులు నలుగుర్ని వరుసగా విచారణకు పిలుస్తున్నారు. కృష్ణయ్య, సావిత్రి దంపతులు, వారి కుమారులు.. సునీల్‌యాదవ్‌, కిరణ్‌ యాదవ్‌తో పాటు నందిని అనే మహిళను విచారణకు పిలిచారు.

గతంలో పులివెందుల సమీపంలోని ఓ గ్రామంలో నివాసమున్న కృష్ణయ్య కుటుంబం.. అప్పులు చేసి అనంతపురానికి మకాం మార్చినట్లు తెలిసింది. మూడేళ్ల కిందట మళ్లీ పులివెందులకు వచ్చి వివేకా నివాసముండే భాకరాపురంలో నివాసం ఉంటున్నారు. సునీల్ యాదవ్‌ వివేకాతో అత్యంత సన్నిహితంగా మెలిగేవాడని సమాచారం. వారి మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలు, అన్ని విషయాలనూ సీబీఐ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. వివేకా హత్య జరగడానికి 15 రోజుల ముందు సునీల్ యాదవ్, కిరణ్ యాదవ్ తరచూ వివేకాతో ఫోన్‌లో మాట్లాడినట్లు ప్రాథమిక సమాచారం సేకరించారు. పది రోజుల కిందట సునీల్ ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు దాదాపు రెండు గంటల పాటు వారి ఇంటిని పరిశీలించారు. మూడు రోజుల కిందట కడప నుంచి పులివెందులకు వెళ్లిన సీబీఐ బృందం.. వివేకా ఇంటి పరిసరాలు, పూలంగళ్ల సర్కిల్ ప్రాంతాల్లో చక్కర్లు కొట్టింది. సునీల్ వాహనం ముందు వెళ్తుండగా.. వెనుక నుంచి సీబీఐ అధికారులు పరిశీలించారు. సునీల్ కుటుంబానికి వివేకా హత్యపై ఏమైనా సమాచారం తెలిసి ఉంటుందా? అనే ప్రచారం పులివెందులలో జోరుగా సాగుతోంది.

ఇదీ చదవండి:కేన్​​ కెప్టెన్​​ ఇన్నింగ్స్​.. టెస్ట్​ జగజ్జేతగా కివీస్

ABOUT THE AUTHOR

...view details