వివేకా హత్య కేసు(viveka murder case)లో సీబీఐ విచారణ వేగంగా సాగుతోంది. వరుసగా 17వ రోజు అనుమానితులను విచారిస్తున్నారు. బుధవారం కూడా వివేకా కారు మాజీ డ్రైవర్ దస్తగిరిని విచారణకు పిలిచారు. ఇతను వివేకా హత్య జరగడానికి ఆరు నెలల ముందు డ్రైవర్ పని మానుకున్నాడు. వివేకా వద్ద ఎందుకు పని మానుకోవాల్సి వచ్చిందనే కోణంలో అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఇతన్ని దిల్లీకి తీసుకెళ్లిన అధికారులు రెండు నెలల పాటు అక్కడే ప్రశ్నించారు. ఇపుడు వరుసగా విచారణకు పిలుస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
దస్తగిరి నుంచి అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. దస్తగిరిని పులివెందులకు తీసుకెళ్లి వివేకా ఇంటి పరిసరాలను కూడా పరిశీలించి వచ్చారు. ఆర్థిక లావాదేవీలు, భూ తగాదాల కోణంలో విచారించినట్లు తెలుస్తోంది. కడప ఆర్ అండ్ బీ అతిథి గృహంలో పులివెందులకు చెందిన ఐదుగురు అనుమానితులను సీబీఐ విచారించింది. వైకాపా కార్యకర్త కృష్ణయ్య కుటుంబసభ్యులు నలుగుర్ని వరుసగా విచారణకు పిలుస్తున్నారు. కృష్ణయ్య, సావిత్రి దంపతులు, వారి కుమారులు.. సునీల్యాదవ్, కిరణ్ యాదవ్తో పాటు నందిని అనే మహిళను విచారణకు పిలిచారు.