ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 10, 2020, 7:52 PM IST

Updated : Jun 11, 2020, 9:03 AM IST

ETV Bharat / state

'అధికార పార్టీ నేతల భూదందా'... సీఎంకు వైకాపా నాయకుడి లేఖ

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి సేకరించిన భూముల విషయంలో రగడ చెలరేగింది. తక్కువ ధరకు భూములు దొరుకుతుంటే... ఎక్కువ ధర భూములను సేకరించాల్సిన అవసరం ఏముందని అధికార పక్ష నాయకులే ప్రశ్నిస్తున్నారు. భూముల కొనుగోలులో నిధుల దుర్వినియోగం, అవినీతి జరిగిందని వైకాపా నేతలే ముఖ్యమంత్రికి లేఖ రాయడం సంచలనమైంది.

land-acquisition-issue-in-tanuku
తణుకు భూవివాదం

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిరుపేదలకు అందించే ఇళ్ల స్థలాల విషయంలో అధికార పార్టీ నేతలే సీఎంకు లేఖ రాయడం సంచలనం రేపింది.

తణుకు భూవివాదం

తణుకు పట్టణ పరిధిలోని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కాపవరం, పైడిపర్రుతో పాటు అజ్జరం పుంతలో సుమారు 57 ఎకరాలు భూమి సేకరించారు. ఈ భూమికి ఎకరానికి కోటి అయిదు లక్షల చొప్పున పరిహారం చెల్లించారు. కాపవరంలో 40 నుంచి 60 లక్షల రూపాయలకు, పైడిపర్రులో 75 లక్షల రూపాయలకు భూములు దొరికే అవకాశం ఉండగా.... కోటి 5 లక్షల రూపాయలు చొప్పున అజ్జరం పుంతలో కొనుగోలు చేయడం వల్ల 14 కోట్ల రూపాయల వరకు నిధులు దుర్వినియోగం జరిగినట్లు వైకాపా నాయకుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ బలగం సేతుబంధన సీతారామం ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డికి లేఖ రాశారు. అధికారులను బెదిరించి అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. నిరుపేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే లక్ష్యం... దీనివల్ల తన నియోజకవర్గంలో నెరవేరడం లేదంటూ లేఖలో పేర్కొన్నారు. దీంతోపాటు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో లబ్ధిదారులు ఒక్కొక్కరి నుంచి 30 నుంచి 75 వేల రూపాయల వరకు పార్టీ నాయకులు కార్యకర్తలు వసూలు చేశారని ఆరోపించారు.

తణుకు భూవివాదం

భూముల కొనుగోలులో నిధుల దుర్వినియోగం, అవినీతి చోటుచేసుకుందని దీనిపై కమిటీ వేసి విచారణ జరిపించాలని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు.

బెదిరింపులకు లొంగి పనిచేయలేదు: ఆర్డీవో

వైకాపా నాయకుడు బలగం సేతుబంధన సీతారామం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖపై రెవెన్యూ అధికారులు స్పందించారు. కొవ్వూరు ఆర్డీవో లక్ష్మారెడ్డి వివరణ ఇస్తూ... అధికారులకు స్థలం శాశ్వతం కాదు కానీ ఉద్యోగం శాశ్వతమని అందువల్ల ఎవరి బెదిరింపులకు లొంగి తాము పని చేయమని చెప్పారు. కాపవరం, పైడిపర్రులలో భూములు ఇచ్చిన రైతులు కాకుండా మిగిలిన రైతులెవ్వరూ తమ భూములు ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో అజ్జరం పుంతలో కొనుగోలు చేశామన్నారు.

పారదర్శకంగా భూసేకరణ

ప్రభుత్వ నిబంధనల ప్రకారం, రిజిస్ట్రేషన్ ధరలకు అనుగుణంగా ఎకరానికి కోటి యాభై లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ధర అధికంగా ఉందని భావించి రైతులతో బేరసారాలు నిర్వహించి కోటి అయిదు లక్షల రూపాయలకు కొనుగోలు చేశామని ఆర్డీవో లక్ష్మారెడ్డి వివరించారు. ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్న అంశాలు అవాస్తవమని ఆయన ఖండించారు.

నా ప్రమేయం లేకుండానే సేకరించారు: తణుకు ఎమ్మెల్యే

తణుకు పట్టణ పరిధిలో భూములన్నీ తన ప్రమేయం లేకుండానే అధికారులు సేకరించారని తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. పైడిపర్రు భూములు విషయంలోనే ధరలకు సంబంధించి రైతులతో మాట్లాడినప్పటికీ సఫలం కాకపోవడంతో, రైతులు నేరుగా జిల్లా కలెక్టర్ తో సంప్రదించి భూములు ఇవ్వడానికి అంగీకారం తెలిపారన్నారు. భూసేకరణలో ఎటువంటి అవినీతికి తావు లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:వైకాపా నాయకుల వసూళ్లు... డబ్బులిచ్చిన వారికే ఇంటి స్థలం

Last Updated : Jun 11, 2020, 9:03 AM IST

ABOUT THE AUTHOR

...view details