ఆంధ్రప్రదేశ్

andhra pradesh

COUNTING: ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

By

Published : Jul 25, 2021, 7:11 AM IST

ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సిబ్బంది కేటాయింపు, కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళశాలలో ఓట్ల లెక్కింపునకు నాలుగు ప్రత్యేక హాళ్లు ఏర్పాటు చేశారు.

eluru municipal corporation results
eluru municipal corporation results

నేడు ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అందుకోసం సీఆర్​ఆర్ కళాశాలలో నాలుగు ప్రత్యేక హాళ్లను ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాలతో మార్చి 10న ఎన్నిక జరిగి ఫలితాలు నిలిచిపోయిన నేపథ్యంలో లెక్కింపు ప్రక్రియ కోసం సుదీర్ఘకాలం నిరీక్షించాల్సి వచ్చింది. ఫలితాల వెల్లడికి న్యాయస్థానం పచ్చజెండా ఊపడంతో ఎట్టకేలకు ఆదివారం లెక్కింపు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా.. నగరంలో రాజకీయ సందడితోపాటు అభ్యర్థులు, కార్యకర్తలు, పార్టీశ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.

నగరంలో మొత్తం 50 డివిజన్లకు మూడు ఏకగ్రీవం కాగా మిగిలిన 47కు ఎన్నికలు జరిగాయి. వాటికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి సీఆర్‌రెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలోని నాలుగు కేంద్రాల్లో మొదలవుతుంది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి దాదాపు అన్ని డివిజన్ల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తక్కువ ఓట్లు ఉన్న డివిజన్లవి కొంచెం ముందుగా వెల్లడి కావచ్ఛు దీనికి తగ్గట్టుగా ఒక్కో డివిజన్‌కు ఒక్కో లెక్కింపు టేబులు ఏర్పాటు చేశారు. దీంతో అన్ని డివిజన్లలో ఈ ప్రక్రియ ఏకకాలంలో మొదలవుతుంది.

నాలుగు లెక్కింపు కేంద్రాల్లో, స్ట్రాంగ్‌రూం, మార్గాల్లో నిఘానేత్రాలు ఏర్పాటు చేశారు. బల్లకు ఒక్కో పర్యవేక్షకుడు, నలుగురు సిబ్బంది, బ్యాలెట్‌ పత్రాలు అందించే ఓ వ్యక్తితో కలిపి మొత్తం ఆరుగురు చొప్పున ఉంటారు. మొత్తం 283 మంది ఉన్నారు. వీరు కాకుండా ఒక్కో లెక్కింపు కేంద్రానికి పురపాలక శాఖకు చెందిన ఓ అధికారి, డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారిని పర్యవేక్షణకు నియమించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని జేసీ వెంకటరమణారెడ్డి తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ వేగంగా ఫలితాలు వెల్లడిస్తామని వివరించారు.

ఓట్ల శాతమిలా..

నగర పాలక సంస్థ ఎన్నికల్లో 56.82 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం ఓటర్లు 2,32,972 మంది కాగా.. 1,12,520 మంది మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు.

పోటీ ఇలా..

ఏలూరు కార్పొరేషన్‌లో 50డివిజన్లు ఉండగా 3 ఏకగ్రీవం అయ్యాయి. మార్చి 10న 47 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. వైకాపా 47, తెదేపా 43, జనసేన 19, భాజపా 14, స్వతంత్రులు 39 స్థానాల్లో పోటీ పడ్డారు.

ఇదీ చదవండి:Viveka murder case: వివేకా హత్య కేసులో నా ప్రమేయం లేదు: ఎర్ర గంగిరెడ్డి

ABOUT THE AUTHOR

...view details