ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 1, 2020, 5:03 PM IST

Updated : Dec 1, 2020, 5:53 PM IST

ETV Bharat / state

మూడు ప్రభుత్వాలు మారినా... చింతలపూడి తలరాత మారలేదు..!

కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లా మెట్ట ప్రాంతాల వరదాయినిగా ప్రసిద్ధిచెందిన చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు నత్తను నడకన సాగుతున్నాయి. గోదావరిపై నిర్మిస్తున్న ఈ పథకం ప్రారంభమై పుష్కరకాలం గడుస్తున్నా.. ఒక్కఎకరానికీ నీటిని అందించలేని దుస్థితి. భూసేకరణ సమస్య, నిధులలేమి అడ్డంకుల వల్ల పనులు జరగలేదు. రాష్ట్రంలో పట్టిసీమ తర్వాత మరో అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టుగా నిలిచే చింతలపూడి... ఆలస్యంగా సాగుతున్న తీరుపై ప్రత్యేక కథనం.

Chintalapudi Lift Irrigation Project Works going slowly
మూడు ప్రభుత్వాలు మారినా... చింతలపూడి తలరాత మారలేదు..!

మూడు ప్రభుత్వాలు మారినా... చింతలపూడి తలరాత మారలేదు..!

గోదావరి వరదనీటిని సద్వినియోగం చేసుకొని... కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల రైతులకు మేలు చేకూర్చడానికి చింతలపూడి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. గోదావరి నదిపై ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించి.. రెండు జిల్లాలోని మెట్టప్రాంతాలైన 33 మండలాలకు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. తాగు, సాగు నీరు, పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తూ...17 వందల కోట్ల వ్యయంతో 2008లో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. మధ్యలో అనేక మార్పులు చోటుచేసుకొన్నా నేటికి పనులు మాత్రం పూర్తికాలేదు.

మూడు ప్రభుత్వాలు మారినా.. ఈ పథకం తలరాత మారలేదు. ఎత్తిపోతలు, కాలువ పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. భూసేకరణ వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉండి అడ్డంకులు ఏర్పడ్డాయి. కాలువ తవ్వకానికి భూసేకరణ చేసే సమయంలో ఒక్కో జిల్లాకు ఒక్కో ధర నిర్ణయించడం వల్ల.. న్యాయపరమైన చిక్కులు తలెత్తాయి. కృష్ణా జిల్లాలో ఎకరాకు 25లక్షల రూపాయలు చెల్లించారు. పశ్చిమగోదావరి జిల్లాలో మాత్రం 15 లక్షల రూపాయలు ఇవ్వడం వల్ల.. రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఆలస్యమయ్యేకొద్దీ.. ఈ పథకం వ్యయం పెరుగుతోంది. ప్రారంభంలో 17వందల కోట్ల రూపాయల అంచనా వేశారు. ప్రస్తుతం 4900 కోట్ల రూపాయలకు చేరుకొంది. ఈ పథకానికి నిధుల కొరత ఏర్పడటం వల్ల.. కాలువ తవ్వకం పనులు నిలిపివేశారు. ప్రస్తుతం నాబార్డు 1900 కోట్ల రూపాయలు రుణం అందించడానికి ముందుకు వచ్చింది. న్యాయస్థానాల చిక్కుల వల్ల పనులు మందగించాయి. చింతలపూడి ఎత్తిపోతల పథకం సకాలంలో పూర్తికాకపోవడం వల్ల తీవ్ర నష్టం జరుగుతోందని మెట్టప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి వద్ద గోదావరిపై చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నారు. 20 టీఎంసీల సామర్థ్యంతో 14 పంపుల ఏర్పాటుకు శ్రీకారంచుట్టారు. 3 ఎత్తిపోతల పథకాల ద్వారా రెండు జిల్లాలకు నీరందించడానికి ప్రణాళిక రూపొందించారు. వీటి ద్వారా 86 మీటర్ల ఎత్తుకు నీటిని సరఫరా చేయాల్సి ఉంది. లిఫ్టులు, కాలువ పనులు రెండు ప్యాకేజీలుగా విభజించి.. పనులు ప్రారంభించారు.

పశ్చిమగోదావరి జిల్లాలోని 15 మండలాలు, కృష్ణా జిల్లాలోని 18 మండలాలకు నీరందించాల్సి ఉంది. ఈ పథకం ద్వారా జులై నెల నుంచి అక్టోబర్ వరకు నీటిని ఎత్తిపోస్తారు. గోదావరి నదిపై ప్రధాన ఎత్తిపోతల, గోపాలపురం వద్ద మరో ఎత్తిపోతల, కృష్టా, పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దుల్లో మరో ఎత్తిపోతల పంపులు నిర్మిస్తారు. ప్రధాన ఎత్తిపోతల పంపుల నుంచి సుమారు 20కిలోమీటర్ల మేర పైప్​లైన్లు నిర్మించాల్సి ఉంది. అక్కడి నుంచి కాలువల ద్వారా నీటిని గ్రావిటీతో తీసుకెళతారు.

68 కిలోమీటర్ల మేర కాలువలు తవ్వాల్సి ఉంది. చింతలపూడి మండలంలో భూసేకరణ సమస్యవల్ల.. పనులు ఆగిపోయాయి. రెండు జిల్లాల్లోను మెట్ట ప్రాంతాలకు ఈ పథకం ఉపయోగపడనుంది. రెండు ప్యాకేజీలుగా విభజించిన ఈ పనులు ఆసంపూర్తిగా ఉన్నాయి. మోటార్ల బిగింపు, పైప్​లైన్ల ఏర్పాటు, కాలువల తవ్వకాల పనులు మందకొడిదగా సాగుతున్నాయి. చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో ఎదురవుతున్న భూసేకరణ సమస్యలు పరిష్కరించి పనులు పూర్తిచేయాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండీ... ఉపాధి మార్గం.. తితిదే శిల్ప కళాశాల

Last Updated : Dec 1, 2020, 5:53 PM IST

ABOUT THE AUTHOR

...view details