ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 30, 2019, 5:54 PM IST

ETV Bharat / state

'న్యాయం జరగకపోతే... కళాశాలలో మృతదేహాన్ని పూడ్చిపెడతాం'

అగ్రికల్చర్ డిప్లొమా కళాశాల విద్యార్థిని అఖిల మృతిపై ఆందోళనలు జరుగుతున్నాయి. ఆమె మృతదేహంతో కళాశాలలో బాధిత కుటుంబసభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థిని మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు..

protest with student body in nrr college, neliparthi
విద్యార్థిని మృతదేహంతో ఆందోళన

'న్యాయం జరగకపోతే... కళాశాలలో మృతదేహాన్ని పూడ్చిపెడతాం'

విజయనగరం జిల్లా సాలూరు మండలం నెలిపర్తి పంచాయతీ పరిధిలోని ఎన్​ఆర్​ఆర్​ పాలిటెక్నిక్ కళాశాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కళాశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని అఖిల మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రజాసంఘాలతో కలసి నిరసన తెలిపారు. విద్యార్థిని మరణానికి కారణమైన వారిని తక్షణమే అరెస్టు చేసి శిక్షించాలని నినదిస్తూ ఆందోళన చేపట్టారు. న్యాయం జరగకపోతే కళాశాల ఆవరణలో మృతదేహాన్ని పూడ్చిపెడతామని బంధువులు హెచ్చరించారు.

నెలిపర్తి గ్రామంలో ఉద్రిక్తత
అఖిల బంధువులు, విద్యార్థి సంఘాలు విద్యార్థిని మృతదేహంతో సాలూరు శివాజీ బొమ్మ నుంచి ర్యాలీగా కాలేజీ వరకు చేరుకున్నారు. ఈ క్రమంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తమ గ్రామం పొలిమేర దాటి ఇతర గ్రామానికి చెందిన విద్యార్థిని మృతదేహాన్ని ఎలా తీసుకొస్తారు అంటూ నెలిపర్తి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని ర్యాలీని అడ్డుకున్నారు. పరిస్థితి చేయి దాటిపోతుందని భావించిన పోలీసులు నెలిపర్తి గ్రామస్థులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు. అఖిల మృతదేహంతో కళాశాల ఆవరణలో కుటుంబ సభ్యులు, బంధువులు శాంతియుతంగా నిరసన తెలియజేశారు.
అవమానమే ఆత్మహత్యకు పురిగొల్పింది
తెర్లాం మండలం బూర్జివలస గ్రామానికి చెందిన బోనంగి అఖిల ఎన్​ఆర్​ఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం అగ్రికల్చర్ డిప్లొమా విద్యార్థిని. ఈ నెల 25న కళాశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విశాఖ కేజీహెచ్​లో చికిత్స పొందుతూ ఈ నెల28న మరణించింది. అయితే అఖిల మృతికి కళాశాల వసతి గృహం వార్డెన్, ప్రిన్సిపాల్​ కారణమని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

తోటి విద్యార్థుల ముందు అవమానకరంగా మాట్లాడటంతోనే అఖిల ఆత్మహత్య చేసుకుందని వారు అంటున్నారు. తనకు చెందిన వెయ్యి రూపాయలు పోయాయని... వాటిని అఖిల తీసిందినే అనుమానం ఉందని ఓ విద్యార్థిని రాసిన లేఖను కళాశాల నోటీస్​ బోర్డులో ఉంచారని వారు తెలిపారు. అవమానాన్ని భరించలేక అఖిల ఆత్మహత్యకు పాల్పడిందని అఖిల్ తండ్రి శంకర్రావు, చిన్నాన్న రామకృష్ణ ఆరోపించారు. అంతేకాకుండా ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే మార్కులు తగ్గిస్తామని అఖిలను కళాశాల యాజమాన్యం బెదిరించిందని అంటున్నారు. అఖిల ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే మృతదేహాన్ని కళాశాల ఆవరణలో పూడ్చి పెడతామన్నారు.

అఖిల మృతదేహానికి కళాశాల కరస్పాండెంట్ రామారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సమయంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కరస్పాండెంట్ నివాళులు అర్పించడాన్ని బాధిత కుటుంబసభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. చివరికి పోలీసుల జోక్యంతో వారు శాంతించారు. న్యాయం జరిగేవరకు కదిలేది లేదని వారు స్పష్టం చేశారు. పోలీసులు పెద్ద ఎత్తున కళాశాలకు చేరుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details