ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పరిశ్రమలకు భూములు కేటాయించినా.. ముందుకు రాని ఔత్సాహికులు

By

Published : Jan 15, 2021, 9:12 PM IST

బొబ్బిలిలో నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం ఇటీవల ప్రకటించడంతో మంచి రోజులు వస్తాయని అంతా భావించారు. కానీ నేటికీ అమలు కాకపోవడంతో యువతకు నిరాశే మిగులింది. పరిశ్రమల ఏర్పాటుకు భూములను కేటాయించినప్పటికీ.. ఎవరూ ముందుకు రాకపోవడంతో రైతులు వాటిలో పంటలు సాగు చేసుకుంటున్నారు. ఫలితంగా పరిశ్రమలు ప్రారంభించని 39 మందికి ఏపీఐఐసీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

no-industries-in-bobbili-industrial-area-in-vizianagaram
పరిశ్రమల ఏర్పాటుకు భూములు కేటాయించినా.. ముందుకు రాని ఔత్సాహికులు

విజయనగరం జిల్లా బొబ్బిలి పారిశ్రామికవాడ నిరుద్యోగులకు ఊరడింపుగా మారింది. పరిశ్రమలొస్తే వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ యువతకు నిరాశే మిగులుతోంది. కారణం.. ఏళ్లు గడుస్తున్నా పరిశ్రమలు ఏర్పాటు కాకపోవడమే. ఉన్న పరిశ్రమలు మూతపడుతుండడం, కొత్తవి రాకపోవడంతో ప్రగతి లేదు. యూనిట్ల ఏర్పాటుకు స్థలాలు తీసుకుని ప్రారంభించని వారి నుంచి స్వాధీనం చేసుకుంటామంటూ గత రెండ్రోజులుగా ఏపీఐఐసీ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు.

39 మందికి నోటీసులు..

పారిశ్రామికవాడలో 80 శాతం భూములు పరిశ్రమలకు ప్లాట్లుగా విభజించి కేటాయించారు. ఇందులో స్టీల్‌ ఎక్ఛ్సేంజ్‌ ఇండియాకు సుమారు 87 ఎకరాలు కేటాయించారు. మాంగనీసు ఓర్‌ ఇండియాకు 120 ఎకరాలు, బీకే స్టీల్‌కు 220 ఎకరాలు ఇచ్చారు. ప్రధానంగా ఈ మూడు పరిశ్రమలు వస్తే అనుబంధంగా మరికొన్ని వస్తాయని అంచనా వేశారు. ఇవి ఇంతవరకు ఏర్పాటు కాలేదు. పరిశ్రమ ఏర్పాటు చేయలేమని బీకే స్టీల్‌ యాజమాన్యం ఇప్పటికే చేతులెత్తేయడంతో ఆ స్థలాన్ని ఏపీఐఐసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన రెండు పరిశ్రమల యాజమాన్యాలకు అధికారులు నోటీసులిచ్చారు. రసాయన, ఇటుకలు, కాగితపు తయారీ తదితర చిన్నతరహా పరిశ్రమలకు కూడా భూములు కేటాయించగా వారూ ముందుకు రాలేదు. మొత్తం 39 మందికి తాజాగా నోటీసులు అందజేశారు. ఏర్పాటైన యూనిట్లలో కొన్ని మూతపడ్డాయి. ఫెర్రో అల్లాయిస్‌ పరిశ్రమను యాజమాన్యం మూసివేసింది.

కారణం ఏమిటి?

ప్రభుత్వ రాయితీలపై స్పష్టత లేకపోవడం, విద్యుత్తుపై రాయితీ ఎత్తివేయడం, బ్యాంకర్ల సహకారం లేకపోవడం, ఏపీఐఐసీ అధికారుల్లో చిత్తశుద్ధి లేకపోవడం, నూతన పారిశ్రామిక, విధానంపై అవగాహన కల్పించకపోవడం.

భూమి అందుబాటులో ఉన్నా..

నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం ఇటీవల ప్రకటించడంతో మంచి రోజులు వస్తాయని అంతా భావించారు. పరిశ్రమల ఏర్పాటుకు 68 ఎకరాలు అందుబాటులో ఉందని, రెండు నెలలుగా ఔత్సాహికులు ఎవరూ ముందుకు రాలేదని అధికారులు చెబుతున్నారు. భూములు ఖాళీగా ఉండడంతో పారిశ్రామికవాడ చుట్టూ ఉన్న గ్రామాల రైతులు వాటిలో పంటలు సాగు చేసుకుంటున్నారు. పరిశ్రమలు వస్తే ఖాళీ చేస్తామని చెబుతున్నారు.

ఏర్పాటు చేయకుంటే స్వాధీనమే..

పరిశ్రమలు ఏర్పాటు చేయకుంటే ఆయా స్థలాలను ఏపీఐఐసీ స్వాధీనం చేసుకుంటుంది. ఇప్పటికే 39 మందికి నోటీసులు ఇచ్చాం. మరికొంత మందిని గుర్తించి వారికి కూడా అందజేస్తాం.ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే కేటాయిస్తాం. పెద్ద పరిశ్రమలు రాకపోవడంపై ఉన్నత స్థాయిలో చర్చ జరుగుతోంది. - సుధాకర్‌, ఏపీఐఐసీ, సంయుక్త ప్రబంధకుడు

పారిశ్రామికవాడ ముఖచిత్రం

విస్తీర్ణం 1157 ఎకరాలు, మొత్తం ప్లాట్లు 350, ఇంతవరకు కేటాయించినవి 135, ఏర్పాటైన యూనిట్లు 87, నిర్మాణంలో ఉన్నవి 48, మూతపడ్డ యూనిట్లు 17, ఉపాధి లక్ష్యం 3 వేల మందికి.

ఇదీ చదవండి:

గజరాజుల బీభత్సం.. కళ్లాల్లో ధాన్యం ధ్వంసం

ABOUT THE AUTHOR

...view details