విశాఖ జిల్లా మాకవరపాలెంలో భారీఎత్తున గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విశాఖ ఏజెన్సీ నుంచి పశ్చిమబంగకు చెందిన లారీలో 46 గోనె సంచులలో 2,160 కిలోల గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో.. పోలీసులు గుర్తించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నర్సీపట్నం ఏఎస్పీ సహకారంతో కొత్తకోట సీఐ లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో వాహనాన్ని తనిఖీ చేశారు. సుమారు 50 లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
లారీతోపాటు రెండు ద్విచక్ర వాహనాలు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో పశ్చిమబంగకు చెందిన మహమ్మద్తో పాటు, మాకవరపాలెం మండలం చామంతిపురం గ్రామానికి చెందిన బొడ్డు గంగాధర్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు వివరించారు. మరో ఏడుగురు నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు.