విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆసుపత్రిని 100 పడకల నుంచి 150 పడకలకు అప్గ్రేడ్ చేస్తూ...గత ఏడాది ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆసుపత్రి ఆధునీకరణకు ప్రభుత్వం రూ. 8.85 కోట్లు విడుదల చేసింది. ఈ పనులకు ఇటీవల స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ శ్రీకారం చూట్టారు. ప్రస్తుతం ఆసుపత్రి ముందున్న పార్కింగ్ షెడ్ తొలగించి... ఆస్థలంలో రెండు అంతస్థుల్లో భవనాన్ని నిర్మించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భవనం గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ సదుపాయం కల్పించనున్నారు.
నర్సీపట్నం పరిసర ప్రాంతాలకు ఈ ఆసుపత్రి పెద్దదిక్కుగా నిలుస్తోంది. ప్రతిరోజు ఆరు నుంచి ఏడు వందల వరకు ఓపీ ఉంటుంది. సగటున నెలకు 400 ప్రసవాల వరకు జరుగుతాయి. ఇటీవలే ఆస్పత్రికి పూర్తిస్థాయిలో వైద్యులతోపాటు వైద్య సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. అదనపు భవనాల నిర్మాణంతో ఆసుపత్రికి మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. భవన నిర్మాణ పనులకు సంబంధించి ఏడాదిలోగా పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ నీలవేణి స్పష్టం చేశారు.