గాజువాక ప్రజల సమస్యలు తీరుస్తాం: నాగిరెడ్డి
పరిశ్రమల కోసం భూములు ఇచ్చిన గాజువాక ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామని నియోజకవర్గ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తెలిపారు. నిర్వాసితుల సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు.
పారిశ్రామిక నగరిగా గుర్తింపు పొందిన విశాఖ జిల్లాలోని గాజువాకలో అనేక సమస్యలు ఉన్నాయని వైకాపా నేత, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. వైజాగ్ జర్నలిస్టు ఫోరం నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇప్పటివరకు పాలకులు గాజవాక సమస్యల పరిష్కారంపై తీవ్ర నిర్లక్ష్యం చూపించారని విమర్శించారు. స్టీల్ ప్లాంట్కు భూములు ఇచ్చిన అనేక మందికి న్యాయం జరగలేదన్నారు. ఫార్మా సిటీ, గంగవరం, ఏపీఐఐసీకి ఇలా వివిధ అవసరాల కోసం భూములు ఇచ్చిన వారిని ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారం దిశగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని తిప్పల నాగిరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వంలో ప్రజలకు కచ్చితంగా న్యాయం జరుగుతుందన్నారు.