Tirumala Srivari Break Darsham Changed Timing: తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాలను మార్పు చేస్తూ తి.తి.దే. తీసుకొన్న నిర్ణయం గురువారం నుంచి అమలులోకి వచ్చింది. గతంలో తెల్లవారుజామున 5:30 గంటలకు ప్రారంభమయ్యే బ్రేక్ దర్శనాలు.. ఇప్పుడు 8 గంటలకు ప్రారంభిస్తున్నారు. గతంలో మంగళవారం 6:30 గంటలకు, శుక్రవారం 8:30 గంటలకు బ్రేక్ దర్శనాలు ప్రారంభించేవారు. శ్రీవారి దర్శనం కోసం రాత్రి నుంచి కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు ఉదయం త్వరగా స్వామివారి దర్శనం కల్పించేందుకు బ్రేక్ దర్శన సమయాన్ని మార్పు చేసినట్లు అధికారులు ప్రకటించారు.
ప్రయోగాత్మకంగా అమలు చేసిన మొదటిరోజు ఉదయం 6 నుంచి 7:30 గంటల వరకు దాదాపు 8 వేల మంది సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు తితిదే ప్రకటించింది. తితిదే నిర్ణయంపై బ్రేక్దర్శనం చేసుకొనే భక్తుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. గతంలో బ్రేక దర్శనాల అమలు సమయంతో సర్వదర్శనాలు ఉదయం తొమ్మిది గంటల తర్వాతనే ప్రారంభమయ్యేవి.