ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో శనివారం అపహరణకు గురైన ఐదు రోజుల శిశువు ఆచూకీ అభ్యమైంది. ఈ మేరకు జిల్లా ఎస్పీ మలికా గార్గ్ వివరాలను వెల్లడించారు. పాపను అపహరించిన వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. కేసులో నిందితులైనా రెహానా, హాలీమా, రహమతున్నీసాను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. పాపను అమ్మేందుకు రూ.50 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారని ఎస్పీ వివరించారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా కేసును.. 10 గంటల్లోనే ఛేదించామని చెప్పారు.
ఇదీ జరిగింది..
గుంటూరు జిల్లా కారంపూడికి దగ్గర్లోని బట్టువారిపాల్లి గ్రామానికి చెందిన నెలలు నిండిన ఓ గర్భిణి.. కాన్పుకోసం మార్కాపురం మండలంలోని తల్లిగారి గ్రామం కోలాభీమునిపాడుకు వచ్చింది. నొప్పులు రావడంతో ఐదు రోజుల క్రితం కాన్పు కోసం మార్కాపురం జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో కోమలిని చేర్చారు. ఆమె అక్కడ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పసికందుకు కామెర్ల వ్యాధి లక్షణాలు కనిపించడంతో వైద్యులు ఫొటోగ్రఫీ వైద్యం కోసం ప్రత్యేక వార్డులోకి తీసుకెళ్లారు. బంధువులను తమ గదిలోకి వెళ్లి ఉండాలన్నారు. ఎంత సేపటికీ సిబ్బంది బయటకి రాకపోవడంతో తల్లి కోమలి వార్డులోకి వెళ్లి చూసింది.
అక్కడ సిబ్బందితో పాటు, పాప కూడా కనిపించలేదు. తమ పాప ఎక్కడంటూ సిబ్బంది అడగ్గా వార్డులోనే ఉంచి తాము భోజనానికి వెళ్లామని నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. పాప కోసం చుట్టుపక్కల గాలించారు. ఆచూకీ లేకపోవడంతో చేసేదేం లేక బాధితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ని పరిశీలించారు. అందులో ఓ మహిళ బుర్కా ధరించి పసికందును వేగంగా తీసుకువెళుతున్న దృశ్యాలు కనిపించాయి. పాప కోసం గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు.. గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నారు.
అనుబంధ కథనం:
BABY MISSING: మార్కాపురం వైద్యశాలలో అదృశ్యమైన పసికందు ఆచూకీ లభ్యం