వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాగుతున్న తొలి స్థానిక సంస్థల ఎన్నికలు ఇవే. దీంతో ప్రజా ప్రతినిధులు వారి సత్తా చాటుకోవాలని చూస్తున్నారు. మంత్రులకు కూడా ఇది సవాల్గా మారింది. ముఖ్యమంత్రి ఈ ఎన్నికల గురించి ప్రత్యేకంగా పట్టించుకోవడంతో మంత్రులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. పార్టీ గుర్తులేకుండా నిర్వహించే పంచాయతీ ఎన్నికలపై గతంలో అంతగా దృష్టి పెట్టేవారు కాదు. ఎన్నికల కమిషన్తో సాగుతున్న రగడ నేపథ్యంలో దీనిపై అన్ని పార్టీలో ఉత్కంఠ నెలకొంది. ప్రతిపక్షాలు కూడా గ్రామాల్లో తమపట్టు చాటుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జులు ఇప్పటికే గ్రామాల్లో పర్యటిస్తున్నారు.
పట్ణణాల్లోనే మంతనాలు...
జిల్లాలో 10 పట్టణాలున్నాయి. ఒంగోలు నగరం, చీరాల, మార్కాపురం, కందుకూరు, మున్సిపాలిటీలతో పాటు గిద్దలూరు, కనిగిరి, అద్దంకి, చీమకుర్తి, దర్శి, పొదిలి నగర పంచాయతీల్లో ముఖ్య నేతలు తిష్ట వేసి పంచాయతీ ఎన్నికలపై దృష్టిసారిస్తున్నారు. అధిక పంచాయతీల్లో తమ వర్గీయులను గెలిపించుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జులంతా పట్టణాల్లోనే నివాసం ఉంటున్నారు. అక్కడి నుంచే గ్రామస్థాయి నాయకులతో చర్చలు కొనసాగిస్తున్నారు. ఇటీవల వైకాపా కార్యాలయంలో పంచాయతీ ఎన్నికలపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా పాల్గొన్నారు. తెదేపా జిల్లా మాజీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులతో ఎన్నికలపై సమాలోచనలు సాగిస్తున్నారు.