ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో ప్రభుత్వ భూములు ఎక్కువ. నిమ్జ్, రైల్వేలైన్, సోలార్ హబ్ వంటి ప్రాజెక్ట్లు కొన్ని నిర్మాణంలో, మరికొన్ని ప్రతిపాదనల్లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇక్కడి ఖాళీ భూములపై అక్రమార్కుల కళ్లు పడ్డాయి. ఏకంగా వందల ఎకరాలను ఆక్రమించారు. రాత్రికి రాత్రే యంత్రాలను ఉపయోగించి చదును చేసి హద్దు రాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. పశువుల బీళ్లు, గ్రేజింగ్ భూములు, వాగు పోరంబోకులనూ వదలటం లేదు.
పామూరు మండలం అయ్యనకోట సమీపంలో సర్వే నంబర్లు 67-1,55-1,102, 106, 261లలో రెండు వేల ఎకరాలకు పైగా వాగు పోరంబోకు, పశువుల బీళ్లు, గ్రేజింగ్ భూములున్నాయి. ఇందులో 150 ఎకరాల్లో ఇతర ప్రాంతాలకు చెందిన వారు పాగా వేశారు. నెల రోజులుగా రాత్రి వేళ్లలో యంత్రాలను ఉపయోగించి చదును చేస్తున్నారు.
పామూరు మండలం సిద్దవరం, బొట్లగూడూరు, పాబోలువారిపల్లి, రజాసాహెబ్పేట గ్రామాల పరిధిలోని సర్వే నంబర్లు 133, 704, 938, 953, 974లలో సుమారు 70 ఎకరాలకు పైగా పశువుల బీడు, వాగు పోరంబోకు భూములున్నాయి. ఇతర ప్రాంతాలకు చెందిన కొందరు కిందిస్థాయి రెవెన్యూ ఉద్యోగులను మచ్చిక చేసుకుని ఈ భూముల్లో పాగా వేశారు. ఇక్కడ 25 రోజులుగా రేయింబవళ్లు అనే తేడా లేకుండా యంత్రాలతో చదును చేసే పనులు సాగుతున్నాయి. పామూరు- కందుకూరు రోడ్డు పక్కనే ఉన్న రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అక్రమార్కుల పరమయ్యాయి.
సీఎస్పురం మండలం ఏకునాంపురంలో 76-20 సర్వే నంబరులో 36 ఎకరాల పశువుల బీడును కొందరు ఆక్రమించారు. ఏకంగా ఈ భూములను ఆన్లైన్లో ఎక్కించి 1బీ అడంగళ్లో నమోదు చేయించి బ్యాంకుల్లో రుణం పొందేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే ఈ విషయమై గ్రామస్థులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
కనిగిరి మండలంలోని గానుగపెంటలో సర్వే నంబరు 255, 177, 178, 179లలో కొందరు రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఏకంగా వంద ఎకరాల పశువుల బీడును ఆక్రమించేశారు. ఇప్పటికే యంత్రాలతో చెట్లు తొలగించి భూమిని చదును చేశారు.