ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 11, 2021, 5:05 PM IST

ETV Bharat / state

నీటిని సరఫరా చేస్తున్న గుత్తేదారులకు బకాయిలు చెల్లించేదెప్పుడు..?

గ్రామీణ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చేందుకు ట్యాంకుల ద్వారా తాగునీటిని సరఫరా చేసే గుత్తేదారులకు దాదాపు రెండేళ్లుగా బిల్లుల్లేవు. ఈ కారణంగా ట్యాంకర్లు తిప్పలేకపోతున్నామంటున్నారు గుత్తేదారులు. కొందరు ట్రిప్పులను నిలిపేయడంతో గ్రామాల్లో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. సొంత పెట్టుబడులు పెట్టుకొని నీటిని సరఫరా చేయలేమని గుత్తేదారులు వాపోతున్నారు.

government did not release water tank bills in prakasham district
government did not release water tank bills in prakasham district

ప్రకాశం జిల్లాలో తాగునీటి సమస్య ఏడాది పొడువునా ఉంటుంది. భూగర్భ జలాలు అడుగంటిపోవడం, సాగునీటి వనరులు లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం ద్వారా ఆయా గ్రామ జనాభాను బట్టి ట్యాంకర్లు కేటాయించి, ట్రిప్పులు కేటాయిస్తారు. గ్రామానికి దూరంగా డీప్‌ బోర్లు వేసి, అక్కడనుంచి నీటిని సరఫరా చేస్తారు. ఒకరోజు ఒక వీధిలో పంపిణీ చేస్తే, మరోరోజు మరో వీధికి నీటిని సరఫరా చేస్తారు. ప్రజలు డ్రమ్ముల్లో నీటిని పట్టుకుని భద్రపరుచుకుంటారు. అవే నీళ్లు ఇంటి అవసరాలకు, తాగేందుకు, పశువులకు వినియోగించుకుంటారు. ఒకరోజు ట్యాంకర్​ రాకపోయినా ప్రజల నీటికష్టాలు అన్నీఇన్నీ కావు.

ఇలా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు ఆర్​డబ్ల్యూఎస్‌ ఆయా గ్రామాల్లో ట్రాక్టర్లను గుర్తించి ఈ బాధ్యత అప్పగిస్తారు. ఒకో ట్రిప్పునకు సుమారు 400 రూపాయలు చొప్పున చెల్లిస్తారు. ఇలా రోజుకు దాదాపు 10 ట్రిప్పుల నుంచి 15 ట్రిప్పుల వరకూ సరఫరా చేస్తారు. కొన్నేళ్లుగా నీటిని సరఫరా చేస్తున్న వారికి దాదాపు 2019 నుంచి బిల్లులు చెల్లింపులు జరపలేదని గుత్తేదారులు పేర్కొంటున్నారు.

ఒక్కో సరఫరాదారునికి రూ.5 లక్షల నుంచి 15 లక్షల వరకూ బకాయిలున్నాయి. జిల్లావ్యాప్తంగా దాదాపు 72కోట్ల రూపాయలు బకాయిలున్నాయి. అప్పటినుంచీ బకాయిలు చెల్లించాలని అడుగుతున్నా.. ప్రభుత్వం నుంచి స్పందన లభించడం లేదు. ట్రాక్టర్ల కొనుగోళ్లకు లక్షలు పెట్టుబడి పెట్టామని, ఒకవైపు డీజిల్‌ ధరలు పెరిగిపోతుండటం వల్ల రోజువారీ ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయని గుత్తేదారులు చెబుతున్నారు. డ్రైవర్‌ జీతం, డీప్‌ బోర్లలో నీటి కొనుగోలుకు ఖర్చవుతుందని, పెట్టుబడులు పెట్టి బిల్లులు రాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో బిల్లులు పెండింగ్‌లో ఉండిపోవడం వల్ల కొంతమంది ట్రాక్టర్లు అమ్ముకుంటున్నారు. బిల్లులు చెల్లిస్తేనే నీటిని సరఫరా చేస్తామని మరికొందరు అంటున్నారు. బకాయిలు చెల్లింపు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని అధికారులు పేర్కొంటున్నారు.

ఇదీ చదవండి:దువ్వాడ సెజ్‌లోని పూజా స్క్రాప్ పరిశ్రమలో అగ్నిప్రమాదం

ABOUT THE AUTHOR

...view details