ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం మనేపల్లి గ్రామానికి చెందిన దళితులు, వెనుకబడిన వర్గాల వారు గత నలభై ఏళ్లుగా గ్రామంలోని సర్వే నెం 249లో 65 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్నారు. ఆ భూములు ఓ మాజీ ప్రజాప్రతినిధి బంధువుల పేరిట 2 సంవత్సరాల క్రితం రిజిస్టర్ అయ్యాయి. ఈ రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని గత రెండు సంవత్సరాల నుంచి అధికారులకు పలు మార్లు విన్నవించుకున్నా.. ఫలితం ఏమీ లేదని వాపోయారు. తమ భూమిలో సజ్జ పంట సాగు చేస్తుండగా ఆ ప్రజాప్రతినిధి మనుషులు నాశనం చేశారని ఆరోపించారు.
ఈ విషయంపై కేసు పెట్టినా పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు. ఆ గ్రామనికి చెందిన డిప్యూటీ తహసీల్దార్, మాజీ ప్రజా ప్రతినిధి కుమ్మక్కై తమకు అన్యాయం చేశారని బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. ఈనామ్ చట్టం, హైకోర్టు తీర్పు ప్రకారం సాగు దారులు ఎవరైతే ఉన్నారో వారికే భూమి చెందాలి. అలా కాకుండా వేరే వారికి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయడం తగదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు వినతిపత్రం అందజేశారు.