ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రాణాలు తీసిన శానిటైజర్.. విషాదంలో 13 కుటుంబాలు

By

Published : Jul 31, 2020, 4:42 PM IST

Updated : Jul 31, 2020, 5:23 PM IST

రాష్ట్రంలో వింత పరిస్థితులు నెలకొన్నాయి. చేతులు శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించే శానిటైజర్లు తాగేస్తున్నారు. శానిటైజర్లు తాగి ప్రకాశం జిల్లాలో 13 మంది చనిపోయారు. కరోనాతో ప్రజలు ఆయోమయానికి గురవుతుంటే... మద్యం దొరక్క మందుబాబులు అల్లాడుతున్నారు. పలు ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి... అక్కడ మద్యం దుకాణాలను మూసివేశారు. మద్యానికి బానిసలైన కొంతమంది కిక్కు కోసం శానిటైజర్లు తాగేస్తున్నారు. మద్యం ధరలు పెరగడం, లాక్​డౌన్ ఆంక్షలు, ఉపాధి లేకపోవడం... కారణం ఏదైనా 13 మంది ప్రాణాలు కోల్పోవడం విషాదం.

ప్రాణాలు తీసిన శానిటైజర్.. విషాదంలో 13 కుటుంబాలు
ప్రాణాలు తీసిన శానిటైజర్.. విషాదంలో 13 కుటుంబాలు

వివరాలు సేకరిస్తున్న పోలీసులు

ప్రకాశం జిల్లాలో మద్యం మహమ్మారికి 13 మంది బలి అయ్యారు. మద్యానికి బానిసై మందు దొరక్క వ్యసనపరులు శానిటైజర్ తాగారు. రెండు వేర్వేరుచోట్ల జరిగిన ఘటనల్లో 13 మంది మృతి చెందారు. ప్రకాశం జిల్లా కురిచేడులో 10 మంది ప్రాణాలు కోల్పోగా... పామూరులో శానిటైజర్ తాగి ముగ్గురు మృతి చెందారు. ఇప్పటివరకు ప్రకాశం జిల్లాలో శానిటైజర్ తాగి 13 మంది మృత్యవాతపడ్డారు. మద్యం దొరక్క శానిటైజర్‌ తాగి చనిపోయినట్లు స్థానికుల వెల్లడించారు.

కురిచేడులో...

కురిచేడులో శానిటైజర్ తాగి 10 మంది మృతి చెందారు. మద్యానికి బానిసైన వీరు.. లాక్​డౌన్ కారణంగా దుకాణాలు మూసివేయడంతో.. శానిటైజర్ సేవించారు. కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కురిచేడుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో లాక్​డౌన్ విధించారు. మద్యం దొరక్క... దొరికినా ఎక్కువ ధర ఉండటంతో... చౌకగా లభ్యమయ్యే శానిటైజర్ తాగడం ప్రారంభించారు. 10 రోజులుగా సుమారు 20 మంది ఇదే అలవాటుగా చేసుకున్నారు.

ఎంతో కొంత మత్తు వస్తుండటంతో రోజు దీనినే కొనసాగించారు. యాచకులు రాజారెడ్డి, కొనగిరి రమణయ్య గురువారం మృతి చెందగా శానిటైజర్ల విషయం బయటకొచ్చింది. శుక్రవారం ఉదయానికి ఒకరి తరువాత ఒకరు మొత్తం 10 మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. యాచకులతో పాటు కడియం రమణయ్య, భోగ్యమ తిరుపతయ్య, అనిగొండ శ్రీను బాబు, గుంటక రామిరెడ్డి, రిక్షా పుల్లర్ చార్లెస్, ఆగస్టీన్ మృతి చెందారు.

పామూరులో...

ప్రకాశం జిల్లా పామూరులోనూ కొవిడ్ నిరారణ చర్యల్లో భాగంగా ఆంక్షలు విధించారు. ఇక్కడా మద్యం దొరక్క ముగ్గురు శానిటైజర్​ తాగి మృతి చెందడం కలకలం రేపుతోంది. శానిటైజర్ తాగి షేక్ ఖాదర్, మల్లికార్జున్‌, రోశయ్య మృతి చెందారు.

శానిటైజర్ సేవిస్తున్న వ్యక్తులు

చెప్పుడు మాటలు విని..

ప్రకాశం జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది దినసరి కూలీలు ఉంటారు. వీరు పగలంతా పనిచేసి సాయంత్రం పూట కొందరు మద్యం సేవిస్తారు. పని, మద్యం సేవించడం వీరి దినచర్యలో భాగం. అయితే లాక్​డౌన్ ఆంక్షలు విధించాక అటు పనులు ఇటు మద్యం దొరకడం లేదు. వ్యసనానికి అలవాటు పడిన కొందరు మత్తు కోసం అల్లాడారు. ఎవరో చెప్పిన మాటలు విని... మత్తు కోసం శానిటైజర్లు తాగడం ప్రారంభించారు. చివరికి అది ప్రాణాల మీదకొచ్చింది.

బాధితుడి మాటల్లోనే

వారం నుంచి శానిటైజర్ తాగుతున్నా. ఇంతకుముందు మందు అలవాటు ఉండేది. లాక్​డౌన్ పెట్టాక మందు దొరకడంలేదు. తలనొప్పి తట్టుకోలేక శానిటైజర్ తాగాం. వేరేవాళ్లు నాకు శానిటైజర్ అలవాటు చేశారు. మా సమీపంలో ఉన్న రెండుమూడు కొట్లలో శానిటైజర్లు కొనుక్కున్నాం.

-బొనిగెల శ్రీను, బాధితుడు

ఘటన వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ

సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం: ఎస్పీ

కురిచేడు ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ తెలిపారు. 10 రోజులుగా శానిటైజర్‌ తాగుతున్నట్లు కుటుంబసభ్యులు చెప్పినట్లు ఎస్పీ వివరించారు. శానిటైజర్ తాగిన మరో 10 మంది కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. చుట్టుపక్కల విక్రయిస్తున్న శానిటైజర్స్‌ సీజ్ చేసి పరీక్షలకు పంపిస్తామని ఎస్పీ వెల్లడించారు. శానిటైజర్స్ నేరుగా తాగారా లేదా వేరే ద్రవంతో కలిపి తాగారా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

ఇవీ చూడండి-కురిచేడు దుర్ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి:చంద్రబాబు

Last Updated : Jul 31, 2020, 5:23 PM IST

ABOUT THE AUTHOR

...view details