ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 2, 2020, 2:40 PM IST

ETV Bharat / state

గ్రామీణ రహదారులకు మహర్దశ.. ఎన్‌డీబీ పనుల్లో కదలిక

మండలాల నుంచి జిల్లాలకు రహదారుల అనుసంధానం పెరగనుంది. మండల కేంద్రాల నుంచి మరో మండల కేంద్రానికి వెళ్లే రహదారులను రెండు వరుసలుగా అభివృద్ధి చేయనున్నారు. ఈ పథకానికి గత ప్రభుత్వంలో రూపకల్పన చేయగా న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఎన్‌డీబీ) రుణ సాయానికి ముందుకొచ్చింది. దీంతో ప్రభుత్వం టెండర్లు పిలిచింది.

village roads development in nellore district
గ్రామీణ రహదారులకు మహర్దశ

మండలాల నుంచి జిల్లాలకు రహదారుల అనుసంధానం పెరగనుంది. మండల కేంద్రాల నుంచి మరో మండల కేంద్రానికి వెళ్లే రహదారులను రెండు వరుసలుగా అభివృద్ధి చేయనున్నారు. ఈ పథకానికి గత ప్రభుత్వంలో రూపకల్పన చేయగా న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఎన్‌డీబీ) రుణ సాయానికి ముందుకొచ్చింది. ఎన్నికల ముందు పనులు ఆగటంతో మళ్లీ పథకాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడానికి చర్యలు చేపట్టింది. రహదారులు, భవనాల శాఖ నుంచి సవివర నివేదిక అందినందున ప్రభుత్వం టెండర్ల నిర్వహణకు చర్యలు చేపట్టింది. దీంతో గ్రామీణ రహదారులపై ఆశలు చిగురించాయి. ఇందులో రుణం 70 శాతం కాగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 30 శాతంగా ఉంటోంది. ఇలా వచ్చే మూడేళ్లలో పనులు పూర్తి చేయడానికి నిర్ణయించారు.

నెల్లూరు జిల్లాల్లో వివిధ శాఖల పరిధిలో 8,414.66 కి.మీ రహదారులున్నాయి. వీటిల్లో జాతీయ రహదారులు మొత్తం బీటీ కాగా స్టేట్‌ హైవేస్‌లో సీసీ, బీటీ రహదారులున్నాయి. జిల్లా మేజర్‌ రహదారుల్లో సీసీ, బీటీ రోడ్లు ఉన్నాయి. స్టేట్‌, జిల్లా రోడ్లు... రహదారులు, భవనాల శాఖ పరిధిలో ఉన్నాయి. ఆయా శాఖల్లో సీసీ రహదారులు 437.70 కి.మీలు కాగా బీటీ రహదారులు 4,701.00 కి.మీ, మెటల్‌ రహదారులు 590.91 కి.మీలు అన్‌మెటల్డ్‌ రహదారులు 2,685.05 కి.మీలు ఉన్నాయి.

వీటిల్లో అత్యధికంగా గ్రామీణ రహదారులు అన్‌మెటల్డ్​గా ఉన్నాయి. వీటిల్లో కొన్నింటికి గతేడాది నిధులు మంజూరైనా పనులు సాగలేదు. ఈ రహదారుల్లో సింగిల్‌ లైన్‌ రహదారులు ఇక 2 వరుసలు కానున్నాయి. దీంతో మండలాల నుంచి జిల్లాకు వేగంగా వాహనాలు వెళ్లనున్నాయి. గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టనుంది. గ్రామీణ ప్రాంతాల్లో రద్దీ ఉండే రహదారులను 2 వరుసలు చేయనున్నారు. ఇలాంటి రహదారుల ఎంపిక బాధ్యత రహదారులు-భవనాల శాఖ చూస్తోంది.

రెండు వరుసలుగా నాయుడుపేట-కోట రహదారి

జిల్లాలోని పట్టణ ప్రాంతాలకు అనుసంధానంగా ఉండే రహదారులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మండల కేంద్రాలకు అనుసంధానం కల్పించే చర్యలు చేపట్టనున్నారు. ఇలాంటి రహదారుల్లో నాయుడుపేట-కోట రహదారి మార్గంలో 2 కి.మీలు విస్తరించకుండా వదిలేశారు. ఇప్పుడు ఈ రహదారిని విస్తరించే అవకాశముంది. నాయుడుపేట మండలం మర్లపల్లి నుంచి జాతీయ రహదారి వరకు దాదాపుగా 2.5 కి.మీ విస్తరించాల్సి ఉంది. పెళ్లకూరు మండలంలో రద్దీగా ఉండే రహదారి శిరసనంబేడు-చెంబేడు. దీనిని ఇటీవల అభివృద్ధి చేశారు. దీన్నీ 2 వరుసలుగా అభివృద్ధి చేసే అవకాశముంది. ఈ మార్గంలో పరిశ్రమలకు వాహనాల రాకపోకలు పెరిగాయి. చిత్తూరు జిల్లాలోని తొట్టంబేడు మండలంలో పలు పరిశ్రమలు ఏర్పాటు కాగా ఇక్కడకు రాకపోకలు పెరిగాయి.

రూ.532 కోట్ల మేర ఖర్చు

రాష్ట్రంలో 1,240 కి.మీ మేర రూ. 2,978 కోట్లు వెచ్చించనున్నారు. జిల్లాలో దాదాపుగా 230 కి.మీల మేర రహదారులు 2 వరుసలు చేసే అవకాశం ఉంది. వీటికి కిలోమీటరకు రూ. 2.13 కోట్ల మేర వెచ్చించనున్నారు. నీటివనరులున్న ప్రాంతాల్లో పై వంతెనలు ఏర్పాటు చేయనున్నారు. ఇలా మొత్తంగా రూ. 532 కోట్ల మేర వెచ్చించే అవకాశముంది. వీటిని నిర్మించిన గుత్తేదారులే ఐదేళ్ల పాటు నిర్వహణ బాధ్యత కూడా తీసుకోవాల్సి ఉంటోంది. వివిధ మండల కేంద్రాల నుంచి రహదారులు పట్టణాలకు అక్కడ నుంచి జిల్లా కేంద్రాలకు రహదారుల్లో వాహనాలు వేగంగా వెళ్లడానికి ఆస్కారం కలుగుతోంది.

ఇవీ చదవండి...

అందని 'పెళ్లి కానుక'.. ఏడాదిగా నవ దంపతుల ఎదురుచూపులు

ABOUT THE AUTHOR

...view details