ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 11, 2020, 9:07 PM IST

ETV Bharat / state

ఎమ్మెల్యేల ఆగడాలను ఆపేదెవరు..?

ప్రజలు, అనుచరులకు అండగా ఉండేవాళ్లని నాయకులంటాం. కానీ.. వాళ్లనే అణగదొక్కుతుంటే ఏమంటాం..? కారణాలేమైనా కొన్ని రోజులుగా రాష్ట్రంలో వైకాపా నేతల దూకుడు పెరిగిపోయింది. సొంత పార్టీ శ్రేణులు, కార్యకర్తలనే భయాందోళనలకు గురి చేస్తున్నారు. కొన్నిచోట్ల ఉద్యోగులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాణహాని ఉందంటూ కొందరు సెల్ఫీ వీడియోలు తీసి చెబుతుంటే.. వేధింపులు తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. గడిచిన కొన్ని రోజుల్లో వైకాపా ఎమ్మెల్యేల తీరుపై వస్తున్న ఆరోపణలు విస్మయం కలిగిస్తున్నాయి.

People Facing Problem from YCP MLAs in AP
ఎమ్మెల్యేల ఆగడాలను ఆపేదెవరు..?

నేతలు దడపుట్టిస్తున్నారు. ప్రజలను పీడిస్తున్నారు. కార్యకర్తలను వేధిస్తున్నారు. వీరి బాధ తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యాయత్నం చేస్తుంటే.. మరి కొంతమంది తమ ప్రాణాలను కాపాడాలంటూ వేడుకొంటున్నారు. గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యే నుంచి ప్రాణాలు కాపాడాలంటూ ఆమె ముఖ్య అనుచరులు బయటకొస్తే.. తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్యే దుర్భాషలాడారని ఓ వాలంటీర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఇక కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యే వర్గీయులు భూములు ఆక్రమించారని ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించగా.. అదే జిల్లాలో మరో ఎమ్మెల్యే తనకు అన్యాయం చేస్తున్నారని ఓ చిన్న కాంట్రాక్టర్.. ఆత్మహత్య చేసుకుంటానని వీడియో విడుదల చేశాడు.

ఇదీ సామాన్యుల పరిస్థితి...

కర్నూలు జిల్లా నంద్యాల శ్రీనివాసనగర్​కు చెందిన లక్ష్మీదేవి అనే మహిళ... నిద్ర మాత్రలు, రెడ్ హిట్ తీసుకుని ఆత్మహత్యకు యత్నించింది. నంద్యాల పురపాలక సంఘం కార్యాలయం వెనుక ఉన్న తమ భూమిని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుటుంబ సభ్యులు... అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బాధితురాలి కూతురు ఆరోపించింది. మనస్తాపం చెందిన తన తల్లి ఆత్మహత్యకు యత్నించిందని తెలిపింది. ముఖ్యమంత్రే న్యాయం చేయాలని బాధితురాలి కూతురు విన్నవించింది. లేదంటే అందరం కలిసి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించింది.

ఓ వాలంటీర్ వేదన...

తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్‌ పి.సువర్ణ జ్యోతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబీకులు వెంటనే ఆమెను రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గ్రామంలో చేపట్టిన పాదయాత్రలో పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు... తనను అందరిలో దూషించడం వల్లే మనస్తాపంతో ఈ యత్నానికి పాల్పడినట్లు బాధితురాలు తెలిపింది.

కార్యకర్తల దీనస్థితి...

గుంటూరు జిల్లాకు చెందిన వైకాపా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, బాపట్ల ఎంపీనందిగం సురేష్ నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ తాడికొండ నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ కార్యకర్తలు శృంగారపాటి సందీప్, సలివేంద్రం సురేష్ ఆరోపించారు. ముఖ్యమంత్రి జగనే తమను కాపాడాలని కోరారు. అక్రమ సంపాదన కోసం ఎమ్మెల్యే ఆశపడ్డారని.. అందుకే అడ్డదారులను తొక్కేందుకు చూశారని ఆధారాలు బయటపెట్టారు.

చిన్న కాంట్రాక్టర్ ఆవేదన...

నంద్యాలకు చెందిన విద్యుత్ స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టర్ మునాఫ్ అనే వ్యక్తి... కుటుంబ సభ్యులతో కలిసి సెల్పీ వీడియో తీశాడు. తనకు న్యాయంగా వచ్చిన కాంట్రాక్ట్​ను నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి అడ్డుపడి స్థానికేతర వ్యక్తికి ఇచ్చాడని మునాఫ్ కుమారుడు సూరజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. మేము బతకకూడదా..? అని వాపోయాడు.

రాజకీయ ప్రత్యర్థులపై అధికార ప్రదర్శించినా అర్థం ఉంటుంది కానీ... ఇలా తమపై చూపిస్తే ఏం లాభమని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ప్రజలను భయాందోళనకు గురిచేసి రాక్షసానందం పొందుతున్నారని ఆక్షేపిస్తున్నారు. సొంతపార్టీ శ్రేణులు తమ మాట వినడంలేదని కక్ష సాధింపు చర్యలు సరికాదని వైకాపా కార్యకర్తలు అంటున్నారు. నేతలు ఇలా చేయడం వల్ల ప్రజల్లో పార్టీ, ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డిపై నమ్మకం సన్నగిల్లుతోందని చెబుతున్నారు.

ఇదీ చదవండీ... వీడియో వైరల్: 'మేము బతకకూడదా'... అంటూ కుటుంబం సెల్ఫీ వీడియో

ABOUT THE AUTHOR

...view details