కరోనా ప్రభావం రాష్ట్రమంతట చూపుతోంది. లాక్ డౌన్ అమలవుతున్న వేళ లావాదేవిలు స్తంభించిపోయాయి. రిజిస్ట్రేషన్ శాఖపై కరోనా పడగ విప్పింది. నిర్దేశిత లక్ష్యన్ని చేరుకోకపోగ తీవ్ర నష్టాలు చవి చూస్తోంది.
కర్నూలు జిల్లాలో 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. స్థిరాస్తి క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రతిరోజు ప్రభుత్వానికి రూ.కోటి నుంచి రూ.1.50 కోట్ల వరకు ఆదాయం లభించేది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరానికి జిల్లా శాఖకు రూ.363.09 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి వరకు రూ.261.75 కోట్ల ఆదాయం సమకూరింది. మార్చి 20 వ తేదీ వరకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరగటంతో మరో రూ.17 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. ఆ తర్వాత జిల్లాలో లాక్డౌన్ అమలులోకి రావటం.. ఆన్లైన్ సర్వర్ పనిచేయకపోవటంతో జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సేవలు ఆగిపోయాయి. దీంతో జిల్లా స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ కేవలం రూ.278.84 కోట్లను మాత్రమే ఆర్జించి ఆదాయ లక్ష్యాన్ని సాధించలేకపోయింది. జిల్లాలో ఆస్పరి, బండి ఆత్మకూరు, నందికొట్కూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మాత్రమే నిర్దేశించిన లక్ష్యాన్ని ఫిబ్రవరి నెలకే సాధించటం విశేషం. ఎన్నికలు, కరోనా ప్రభావం లేకపోయింటే లక్ష్యాన్ని సాధించేవారమని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.