ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 4, 2020, 12:47 PM IST

ETV Bharat / state

లంక గ్రామాల ప్రజల రాత మారదా! నీటి మోక్షం కలగదా!

సగటు మనిషికి అందాల్సిన కనీస అవసరమది.. ప్రాణం నిలవాలంటే నీరు కావాలి.. దాహం తీరాలంటే నాటు పడవ ఎక్కి ఉప్పుటేరు దాటాలి. అసలే లోతు.. ఆపై ప్రమాదం. మదినిండా భయం..ఎక్కిన పడవ దిగే వరకు అలల సుడిలో అపాయం. అయినా తప్పదు ఈ నిరంతర ప్రయాణం..తరాలు జారుతున్నా తరగని సమస్య ఇది. ప్రభుత్వాలు మారుతున్నా తీరని వ్యధ ఇది.!

water problems
water problems

కృష్ణా జిల్లాకు శివారు ప్రాంతమది. కొన్ని గ్రామాల్లో మంచినీటి చెరువుల జాడే కనపడదు. మరికొన్ని ఊళ్లకు కాలువల ద్వారా నీరెళ్లే అవకాశమే లేదు. ఓ వైపు ఉప్పుటేరు.. ఇంకోవైపు చేపలు, రొయ్యల చెరువులు విస్తరించి ఉన్నాయి. భూగర్భ జలాలు ఉప్పుమయంగా మారాయి. ఫలితంగా మంచినీటి బావులు కలుషితమయ్యాయి. తాగునీరు కావాలంటే సరిహద్దులో ఉన్న పొరుగు జిల్లాపై ఆధారపడాల్సిన దయనీయ స్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఏటిలో పడవ ప్రయాణం ప్రాణ సంకటంగా మారింది. ఈ కష్టం తీర్చడానికి సామూహిక రక్షిత మంచినీటి పథకమే సరైన పరిష్కారం. మూడేళ్ల కిందట నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఈ పథకం ముందుకు సాగడం లేదు. నెల రోజులు పని జరిగితే.. ఆర్నెళ్లు ఆగిపోతుంది. ఏటా మాదిరిగానే ఈ వేసవి తీరని దాహంతో గడిచిపోయింది.

ఏడాదంతా ఎద్దడే..

కృష్ణా - పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దులో కలిదిండి మండలం శివారున ఉప్పుటేరుకు ఆనుకొని తాడినాడ, చినతాడినాడ, విభ్రాంపురం, సున్నంపూడి, దుంపలకోడుదిబ్బ, మద్వానిగూడెం, కొండంగి, మట్టగుంట, పెదలంక తదితర గ్రామాలు ఉన్నాయి. ఇవి జిల్లాకు శివారున ఉండడం వల్ల తాగునీటి సమస్యతో అల్లాడుతున్నాయి. కాలువలకు నీటిని విడుదల చేసినప్పటికీ కొండంగి, మట్టగుంట, పెదలంక, చినతాడినాడ గ్రామాలకు చేరడం సాధ్యపడడం లేదు. ఇటీవల కాలంలో ఈ గ్రామాలకు కొంత ఊరటగానే ఉన్నప్పటికీ సున్నంపూడి, దుంపలకోడుదిబ్బ గ్రామాల పరిస్థితి దారుణంగా ఉంది.

ఈ గ్రామాల్లో తాగునీటి చెరువుల జాడ ఉండదు. ఐదు కిలోమీటర్ల దూరాన ఉన్న పోతుమర్రు మంచినీటి చెరువు నుంచి పైపులైన్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయడానికి చాలాకాలం కిందట చేసిన ప్రయత్నం పూర్తిస్థాయిలో సత్ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. గత్యంతరం లేని స్థితిలో పొరుగున ఉన్న పశ్చిమగోదావరి జిల్లా నుంచి మహిళలు పడవలపై వెళ్లి బిందెలతో మంచినీరు తెచ్చుకుంటున్నారు. మగవారంతా తెలవారుజామునే బయటకు వెళ్లిపోవడం వల్ల ఈ బాధ్యతను ఆడవారే తీసుకుంటున్నారు. దీనిపై ‘ఈనాడు’ పలు కథనాలు అందించింది. ఫలితంగా తాడినాడలో రూ.6కోట్ల వ్యయంతో సామూహిక రక్షిత పథకం నిర్మాణాన్ని ప్రారంభించారు.

మూడు వందల మీటర్ల దూరంలో..

ఏడాది కిందట ఓవర్‌హెడ్‌ ట్యాంకు, ఫిల్లరుబెడ్లు వంటి పనులు పూర్తయ్యాయి. పథకాన్ని ప్రారంభించాలంటే పశ్చిమగోదావరి జిల్లా ఐ.భీమవరం నుంచి తాగునీరు సరఫరా చేయాల్సిఉంది. దీనికోసం ఆరు కిలోమీటర్లు పైపులైన్లు వేయాలి. ఇందులో భాగంగా పైపులు వేసే ప్రక్రియ దాదాపు పూర్తయింది. మందపాడు గ్రామం సమీపంలో 300 మీటర్ల మేర పని నిలిచిపోయింది. ఇది పూర్తి కావడానికి గ్రామస్థుల ఆమోదం కోసం అధికారులు కొంతకాలం ఎదురుచూడాల్సి వచ్చింది. దీనిని పరిష్కరించడానికి స్థానిక ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అక్కడి ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. ఈ ఏడాది మార్చి నెల నాటికి తాగునీరు అందిస్తామని అధికారులు కూడా చెప్పుకొచ్చారు.

గుత్తేదారులు చొరవ చూపకపోవడంతో కరోనా రూపంలో లాక్‌డౌన్‌ సమస్య ముంచుకొచ్చింది. దీంతో వేసవికల్లా ఎద్దడి సమస్య తీరిపోతుందని తీరవాసులు కన్న కల తీరలేదు. తొలకరి జల్లు కురిస్తే తీరిపోయే సమస్యకాదిది. ఎప్పుడూ వెంటాడే నీటి కరవు ఇది. ప్రస్తుతం నిబంధనలు సడలుతూ క్రమంగా పరిస్థితులు చక్కబడే దిశగా అడుగులు పడుతున్నందున ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రజల దాహార్తిని తీర్చేందుకు తక్షణ చర్యలు తీసుకుని.. మిగిలిపోయిన 300 మీటర్ల విస్తీర్ణంలో పైపులు ఏర్పాటు చేయించి తాగునీటి సరఫరాకు మార్గం సుగమం చేయాలంటూ వేదనతో నిండిన తీరవాసుల కళ్లు దీనంగా అభ్యర్థిస్తున్నాయి.

త్వరలోనే పనులు పూర్తి చేస్తాం

ఈ ఏడాది జనవరి నెలాఖరునాటికి పైపులైన్ల పనులు పూర్తవుతాయని భావించాం. ఫిబ్రవరి మొదటి వారంలో పథకం పరిధిలోని అన్ని గ్రామాలకు శుద్ధ జలాన్ని సరఫరా చేయాలని అనుకున్నాం. కొన్ని సమస్యలు తలెత్తడం వల్ల జాప్యం జరిగింది. ప్రస్తుతం అవన్నీ పరిష్కారమయ్యాయి. లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా త్వరలోనే పనులు పూర్తి చేసి శుద్ధజలాన్ని అందించే విధంగా చర్యలు తీసుకుంటాం. - ఎంవీవీఎస్‌ మూర్తి, గ్రామీణ నీటి సరఫరా విభాగం డీఈ, కైకలూరు

ఇదీ చదవండి:బాలికపై లైంగికదాడి: పోలీసు కేసు నమోదు

ABOUT THE AUTHOR

...view details