కరోనా విపత్కర సమయంలో ఆటో, మోటార్ రంగాలను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఎం నేత బాబూరావు ఆరోపించారు. ఫైనాన్స్ బకాయిలు చెల్లించలేకపోవడం వల్ల ఫైనాన్సర్లు వాహనాలు స్వాధీనం చేసుకుంటున్నారన్నారు. విజయవాడలో ఆటో కార్మికుల నిరసనకు ఆయన మద్దతు తెలిపారు.
కరోనా వల్ల ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయారని బాబూరావు అన్నారు. లాక్డౌన్ సడలించినా సగం ఆటోలు కూడా తిరగకపోవటంతో... ఆదాయం పడిపోయిందని అన్నారు. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి దొరకక నానా అవస్థలు పడుతున్నారని బాబూరావు ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో మోటార్ రంగం మరింత కుదేలైందన్నారు. రాష్ట్ర రవాణా శాఖ లైసెన్స్ రెన్యువల్, వెహికల్ ఫిట్మెంట్ ఫీజులపై పెనాల్టీలు విధించడం అన్యాయమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో ఆటో, మోటార్ రంగానికి బ్యాంకులు, ప్రభుత్వ ఆర్థిక సంస్థల ద్వారా రుణాలు అందడం లేదని, పైపెచ్చు వాహనాలపై ఇన్సూరెన్స్ తగ్గించకుండా భారీగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వాహనమిత్ర ద్వారా ఆటోలు నడుపుకుంటున్న ఆటో డ్రైవర్లకు రూ.10 వేలు ఆర్థిక సహాయం చేయకపోవడం శోచనీయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ఆటో, మోటార్ రంగాన్ని ఆదుకోవాలని బాబూరావు డిమాండ్ చేశారు. అనంతరం ఆటో కార్మికులకు కోడిగుడ్లు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి:
హార్లీడేవిడ్సన్పై స్వారీ..గుర్రంపై సవారీ.. ఖజనా ఉద్యోగి విలాసం....!