Construction Workers Met Lokesh in Gannavaram :గన్నవరం నియోజకవర్గంలో 192వ రోజు యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. యాత్రలో భాగంగా భవన నిర్మాణదారులు, కార్మిక సమాఖ్య ప్రతినిధులతో లోకేశ్ సమావేశమయ్యారు. జగన్ ధనదాహం 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేసిందని ధ్వజమెత్తారు. తెలుగుదేశం అధికారంలోకి నిర్మాణరంగానికి పరిశ్రమ హోదా కల్పించి మళ్లీ గత వైభవం తెస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. అంతకు ముందు యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. వారికి లోకేశ్ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. వంశీని రాజకీయాల నుంచి బహిష్కరించేందుకు అందరు కలిసికట్టుగా పనిచేయాలి లోకేశ్ కోరారు.
నిర్మాణ రంగానికి పూర్వ వైభవం తెస్తాం : సీఎం జగన్ మోహన్ రెడ్డి ధనదాహం 40లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. అక్రమ సంపాదన కోసం కార్మికుల జీవితాలను చీకటిమయం చేసిన దుర్మార్గుడు జగన్ అంటూ దుయ్యబట్టారు. గత 51 నెలల్లో ఇసుకపై జగన్ అండ్ కో 10 వేల కోట్లకు పైగా దోచుకున్నారని ఆరోపించారు.
గన్నవరం నియోజకవర్గం చినఅవుటపల్లి ఎస్ఎం కన్వెన్షన్ హాల్లో.. రాష్ట్ర భవన నిర్మాణదారులు, కార్మిక సమాఖ్య ప్రతినిధులతో సమావేశమైన లోకేశ్ అధికారంలోకి రాగానే మెరుగైన ఇసుక పాలసీ ద్వారా నిర్మాణ రంగానికి పూర్వ వైభవం (Nara lokesh Promises to Construction Workers) తీసుకువస్తామని భరోసా ఇచ్చారు. నిర్మాణ రంగానికి పరిశ్రమ హోదాతో పాటు, రాయితీలు కల్పించి అండగా నిలుస్తామన్నారు.
టీడీపీలో చేరిన నేతలు : అంతకముందు యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో పలువురు వైసీపీ (YSRCP Leaders join in TDP) నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. గన్నవరం వేదికగా లోకేశ్ సమక్షంలో కొందరు సిట్టింగ్ ఎమ్పీటీసీలు, మాజీ ఎమ్పీపీలు, సర్పంచ్ లు, సహకార బ్యాంకు సభ్యులు పసుపు కండువా కప్పుకున్నారు. వైసీపీలో అవమానాలు తాళలేకే బయటకు వచ్చామన్న యార్లగడ్డ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త పాత నేతలను సమన్వయం చేసుకుంటూ గన్నవరంలో తెలుగుదేశం జెండా ఎగుర వేద్దామని పార్టీ శ్రేణుల్ని కోరారు.