వారాంతం వచ్చిందంటే చాలు కోడి కూర తిందామంటూ ఎదురుచూసే వారెందరో. కరోనా కట్టడిలో భాగంగా ఆదివారాలు చికెన్ దుకాణాలు తెరవకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించినందున.. శనివారం రోజే కొనుగోలు చేసి ఫ్రిజ్లో పెట్టుకోవడం రాష్ట్ర వాసులకు కొద్దివారాల నుంచి అలవాటుగా మారింది. అయితే అమాంతం పెరిగిన చికెన్ ధరలు మాంసాహార ప్రియుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా కేజీ చికెన్ ధర రూ. 310లకు చేరింది.
తగ్గిన కోళ్ల పెంపకం
రాష్ట్రంలో కోళ్ల పరిశ్రమకు గడ్డుకాలం నడుస్తోంది. బ్రాయిలర్ రైతులు కొత్తగా బ్యాచులు వేయకుండా ఆగిపోతున్నారు. లేయర్ రైతులు కోళ్ల పెంపకంపై ఆసక్తి చూపని కారణంగా.. కోడి పిల్లలను ఉత్పత్తి చేసే హేచరీల్లో కార్యకలాపాలు మందగిస్తున్నాయి. ఫలితంగా... రాష్ట్రంలో కోళ్ల పెంపకం గణనీయంగా పడిపోయింది. కోడిపిల్లల ఉత్పత్తిని నిలిపివేసి గుడ్లను నామమాత్రపు ధరకు విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది.
పౌల్ట్రీ నిర్వాహకులు కోళ్ల పునరుత్పత్తిని నిలిపివేయడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో కోళ్ల పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. ఫలితంగా రాష్ట్రంలో కోళ్ల పెంపకం గణనీయంగా పడిపోయింది. ఇందుకు తోడు ఎండ తీవ్రత పెరిగి కోళ్లు తక్కువ బరువు తూగుతున్నాయి.
నష్టం చేసిన వదంతులు
చికెన్ తింటే కరోనా సోకుతుందంటూ పాకిన వదంతులు... కోళ్ల పరిశ్రమను తీవ్రంగా కుంగదీశాయి. ఒక్కసారిగా ధరలు పడిపోయాయి. కేజీ చికెన్ 30 రూపాయలకు మాత్రమే అమ్మిన సందర్భాలూ ఉన్నాయి. ఈ నష్టాన్ని భరించలేక, కోళ్ల పునరుత్పత్తిపై ఖర్చు పెట్టలేక, ఆహారం, ధాన్యం కొరత.. వీటన్నింటి కారణంగా పిల్లల ఉత్పత్తిని చాలావరకూ పౌల్ట్రీ నిర్వాహకులు నిలిపివేసి గుడ్లను విడిగా అమ్ముకోవడం ప్రారంభించారు.