'ఘనంగా అద్దంకి నాంచారమ్మ జాతర ప్రారంభం' కృష్ణా జిల్లా కోడూరు మండలం విశ్వనాధపల్లెలోని అద్దంకి నాంచారమ్మ అమ్మవారి జాతర ఘనంగా ప్రారంభమైంది. సాధారణంగా గ్రామంలోని ఏ గుడి వద్దో జాతరలు జరపటం చూస్తూ ఉంటాం. కానీ ఈ మండలంలో మాత్రం ఇంటింటికీ గ్రామ దేవతను ఊరేగింపుగా తీసుకెళ్లటం ఇక్కడి ప్రత్యేకత. పదిహేను రోజుల పాటు పగలు, రాత్రి అమ్మవారిని తలపై పెట్టుకుని ప్రతి ఇంటికి వెళ్లి పూజలు చేస్తారు. కులమతాలకు అతీతంగా మార్చి 9వ తేదీ వరకు వేడుకను నిర్వహిస్తామని గ్రామస్థులు చెబుతున్నారు.
ఉత్సవ వేడుక సాగుతోందిలా..!
విశ్వనాధపల్లె గ్రామంలో కొలువైన నాంచారమ్మను పరమ భక్తుడు, కొండవీటివారి మూల పురుషుడైన రామినీడు తీసుకుని కృష్ణానదిలో స్నానం చేయిస్తారు. అనంతరం కొండవీటి వారి గృహం వద్ద అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. అనంతరం ఆలయంలోనే గ్రామదేవతను ఉంచి... అక్కడి నుంచి ఉత్సవమూర్తిని తీసుకుని మేళ తాళాలతో ఆసాదులందరూ పందిరి వద్దకు చేరుకుంటారు. అక్కడికి అర్చకులు పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో సనాతన సాంప్రదాయ రీతిలో కొలువై కుంభ నివేదన జరుపుతారు. తర్వాత పగలు, రాత్రులు విశ్వనాధపల్లి, కుమ్మరిపాలెం, వి. కొత్తపాలెం, గాబ గ్రామాల్లో ఊరేగింపుగా అమ్మవారు ఇంటింటా పూజలందుకుంటుంది. ఈ జాతరలో సంతానం లేని దంపతులు అమ్మవారికి పూజలు చేయటంతో సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. తెలుగు రాష్ట్రాల నుంచి లక్ష మందికి పైగా భక్తులు వేడుకల్లో పాల్గొని మెుక్కులు చెల్లించుకుంటారని ఆలయాధికారులు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సమ్మెట ఆంజనేయస్వామి తెలిపారు.
ఇవీ చదవండి: