రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి జగన్ తీరని అన్యాయం చేస్తున్నారని గుంటూరు తెదేపా జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు ఆరోపించారు. గత రెండు నెలల్లోనే రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. చంద్రబాబు మీద కోపంతో రైతులపై కక్షసాధింపు చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. రాజధానిని అభివృద్ధి చేస్తారా? లేదా? అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు అవసరం లేదని చెప్పిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని వ్యాఖ్యానించారు. రాజధాని అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అటకెక్కించారని విమర్శించారు. రైతులను చిన్న చూపు చూడటం తగదని... రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని ఆయన సూచించారు. ప్రజావ్యతిరేక విధానాలను ప్రభుత్వం మానుకోవాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని తెలిపారు.