రంజాన్ పురస్కరించుకొని గుంటూరు జిల్లావ్యాప్తంగా ఈద్గాలలో ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించారు. నెల రోజులు కఠిన ఉపవాసాలతో దీక్ష చేసిన ముస్లిం సోదరులు.. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మంగళగిరి, నగరంపాలెం, కాకుమాను, పెదనందిపాడు, ప్రత్తిపాడు మండలాలోని గ్రామాల్లో ముస్లింలు పెద్ద ఎత్తున ఈదుల్ ఫితర్ నమాజ్ లో పాల్గొన్నారు. మహ్మద్ ప్రవక్త జీవితం స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన సన్మార్గంలో నడుచుకున్నప్పుడే పరలోక సాఫల్యం ఉంటుందని ఇమామ్ లు సందేశం ఇచ్చారు. ఈద్ అంటే పండుగ అని, ఫితర్ అంటే దానం అని... అందుకే రంజాన్ను దానాల పండుగ అంటారని తెలియజేశారు. ఈదుల్ ఫితర్ సందర్భంగా ముస్లిం పేదలను గుర్తించి తమ వంతు సహాయం అందించడమే పండుగ లక్ష్యమన్నారు. ప్రార్థనలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ పాల్గొన్నారు. ఆంధ్రా ముస్లిం కళాశాలలో ఎంపీ గల్లా జయదేవ్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. రంజాన్ పురస్కరించుకుని నిరుపేదలకు ముస్లింలు దానదర్మాలు చేశారు. ఆత్మీయ ఆలింగనాలు చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.