కృష్ణానది వరదల నుంచి పంటపొలాల్ని, జనావాసాల్ని రక్షించడంలో కరకట్ట అడ్డుగోడలా నిలబడుతుంది. భారీ వరదలు వచ్చిన సమయంలో నదీతీరం వెంట ఉండే గ్రామాల్లోకి వరద రాకుండా కాపాడుతుంది. అయితే కరకట్ట బలహీనంగా ఉన్న చోట తరచుగా గండ్లు పడి వరదనీరు గ్రామాల్ని ముంచెత్తిన ఘటనలు ఉన్నాయి.
గ్రామాలు జలదిగ్బంధం
కృష్ణా నదికి 2009లో వరద వచ్చిన సమయంలో భట్టిప్రోలు మండలం ఓలేరు పల్లెపాలెం వద్ద కరకట్టకు గండి పడింది. దీంతో రేపల్లె పట్టణంతో పాటు 18 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వందలాది గృహాలు నేలమట్టమయ్యాయి. పొలాలైతే చాలా రోజుల తర్వాత గాని ముంపు నుంచి బయటపడలేదు. అప్పట్లో గండి పడటానికి కరకట్ట బలహీనంగా ఉండటమే కారణమని నిపుణులు తేల్చారు. దీంతో అప్పటి ప్రభుత్వం కరకట్టలు బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. 113 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. ఇందులో భాగంగా... 7 మీటర్ల వెడల్పుతో బీటీ రోడ్డు వేయటం, కట్టకు అటూ ఇటూ రక్షణ చర్యలు చేపట్టేలా ప్రణాళిక రూపొందించారు.
ఆగిపోయిన పనులు
గుంటూరు జిల్లాలో సీతానగరం నుంచి పెనుమూడి వరకు 64 కిలోమీటర్ల మేర కరకట్టను బలోపేతం చేయాల్సి ఉండగా... 56 కిలోమీటర్లు మాత్రమే పూర్తయింది. వేర్వేరు కారణాలతో 8 కిలోమీటర్ల మేర పనులు ఆగిపోయాయి. విజయవాడ క్లబ్ వద్ద 700 మీటర్లు, పెదకొండూరు వద్ద 800 మీటర్లు, కొల్లూరు వద్ద కిలోమీటర్, దోనెపూడి వద్ద 1.5 కిమీ, పెదపులివర్రు వద్ద 2 కిమీ, వెల్లటూరు వద్ద 2 కిమీ పనులు జరగలేదు. దీంతో పదేళ్లు గడిచినా నేటికీ కరకట్ట బలోపేతం పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ఇటీవల కృష్ణానదికి 2 సార్లు వరద పోటెత్తింది. ప్రకాశం బ్యారేజి నుంచి 7లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీటిని దిగువకు విడుదల చేశారు. మళ్లీ 2009 నాటి పరిస్థితి వస్తుందని తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందారు. అదృష్టవశాత్తూ కరకట్ట లోపలి వైపు మాత్రమే నష్టం జరిగింది. కరకట్టను పటిష్ఠం చేయకపోతే ఎప్పటికైనా ప్రమాదమేనని.... ఆ దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు.