ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాది కనస్ట్రక్షన్‌... వైకాపాది డిస్ట్రక్షన్‌: తెలుగుదేశం

చంద్రబాబు నివాసంలో సమావేశమైన తెలుగుదేశం సీనియర్ నేతలు.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చర్చించారు. తెదేపా శ్రేణులపై వైకాపా దాడులు... ప్రజావేదిక కూల్చివేతను దుయ్యబట్టారు. రాష్ట్రవిభజన తర్వాత కట్టుబట్టలతో వచ్చి తాము నిర్మాణాలు చేపడితే... వైకాపా వస్తువస్తూనే కూలగట్టే కార్యక్రమం చేపట్టిందని విమర్శలు చేశారు.

By

Published : Jun 26, 2019, 9:15 AM IST

Updated : Jun 26, 2019, 6:10 PM IST

సీఎం తీరును తప్పుపట్టిన తెలుగుదేశం

సీఎం తీరును తప్పుపట్టిన తెలుగుదేశం

తెలుగుదేశం శ్రేణులపై జరుగుతున్న దాడులను ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. చంద్రబాబు నివాసంలో సమావేశమైన తెలుగుదేశం నేతలు... ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. కక్ష సాధింపులో భాగంగానే ప్రజావేదిక కూల్చివేశారని... ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండగా వాటిని విడిచి పెట్టి ప్రజావేదికపైనే దృష్టి పెట్టడాన్ని నిందించారు. తెలుగుదేశం శ్రేణులపై వైకాపా నేతలు దాడులు చేసి చంపుతుంటే... పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడులను అరికట్టాలని డీజీపీని రేపు కలుస్తామని తెలిపారు.

తాజా పరిణామాలపై చర్చ

అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చేలోపు.. నలుగురు రాజ్యసభ సభ్యులు భాజపాలో చేరడం, మరో ఒకరిద్దరు నేతలు తెదేపా నుంచి బయటకు వెళ్లడం, ప్రజావేదిక కూల్చివేత నిర్ణయం, తెలుగుదేశం నేతలపై దాడులు, చంద్రబాబు కుటుంబానికి భద్రత కుదింపు వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. వీటన్నింటిపైనా ఈ సమావేశంలో నేతలు చర్చించారు. ప్రజోపయోగమైన ప్రజావేదికను కూల్చివేయడంపై అన్నివర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. నూతన నిర్మాణంపై దృష్టి పెట్టకుండా కూలగొట్టడంపైనే జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారని ఆక్షేపించారు. అప్పటి పరిస్థితుల్లో ఒక సమావేశం పెట్టడానికి మందిరమూ లేక, ప్రైవేటు భవనాలూ ఖాళీలేక.. అప్పటికప్పుడు యుద్ద ప్రాతిపదికన నిర్మించిన భవనమని నేతలు గుర్తుచేసుకున్నారు. తమ మీద కోపంతోనో, లేఖ రాశాం కాబట్టే ఇవ్వాల్సి వస్తుందనే అక్కసుతోనో కక్ష సాధింపులో భాగంగానే ఇంత హడావుడిగా దానిని కూలగొట్టారని ధ్వజమెత్తారు. జగన్‌ కుటుంబం నిర్మించిన భవనాలన్నీ నిబంధనలు ఉల్లంఘించి నిర్మించినవేనని నేతలు ఆరోపించారు.

రాజశేఖరరెడ్డి లేఖ రాసింది నిజం కాదా?

ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాను, స్థలం అభివృద్ధికి ఇచ్చి అప్పులు తీర్చుకుంటానంటూ హైదరాబాద్ బంజారాహిల్స్ లో స్థలం క్రమబద్దీకరించాలని నాడు రాజశేఖర రెడ్డి... అప్పటి ప్రభుత్వానికి లేఖ రాయలేదా అని నేతలు నిలదీశారు. అధికారంలోకి వచ్చాక తాను బైటకెళ్లి తన కేబినెట్ తో క్రమబద్దీకరించుకోలేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో జగన్‌ కుటుంబం ఇల్లే ఒక కబ్జా అయినా అప్పటి ప్రభుత్వం భవనాన్ని కూలగొట్టిందా అంటూ నిలదీశారు. జగన్‌ మేనమామ కడపలో బుగ్గవంక ఆక్రమించి సినిమా థియేటర్లు కట్టుకున్నాడని, నిబంధనలకు వ్యతిరేకం కాబట్టి వాటిని కూడా కూలగొట్టాలని డిమాండ్‌చేశారు. తమ తండ్రికి అసైన్ మెంట్ చట్టం తెలియదు కాబట్టే ఇడుపులపాయలో వందలాది ఎకరాల అసైన్డ్ భూములు కొన్నారని, ఇప్పుడు చట్టం గురించి తెలిసింది కాబట్టి 600 ఎకరాలు ఇచ్చేస్తున్నానంటూ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. చంద్రబాబు నివాసం జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ నేతలు హెచ్చరించారు.

దాడులపై ఆగ్రహం

తెదేపా కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు పేట్రేగిపోవడాన్ని నేతలు తీవ్రంగా ఖండించారు. మంగళగిరి తెదేపా నేత తాడిబోయిన ఉమా యాదవ్ హత్య వైసిపి అరాచకాలకు పరాకాష్టగా దుయ్యబట్టారు. ఉమా యాదవ్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. గత 33 రోజుల్లోనే 140పైగా భౌతిక దాడులు, ఆస్తుల విధ్వంసాలు చోటు చేసుకోవడంపై సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో ఈ ఘటనలు తెలియజేస్తున్నాయని ఆవేదన చెందారు.

Last Updated : Jun 26, 2019, 6:10 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details