చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం... ఏపీలో ప్రముఖ వాణిజ్య పంట మిర్చి ధరలపైనా పడింది. మిర్చి క్రయవిక్రయాలకు ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ గా గుంటూరుకు పేరుంది. ఇక్కడకు వచ్చే మిర్చి సరకు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాలకూ ఎగుమతి అవుతుంది. ముఖ్యంగా గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో పండించే.. తేజా రకం మిర్చికి చైనా దేశంలో మంచి గిరాకీ ఉంది. డిమాండ్ మేరకు అక్కడికి వ్యాపారులు మిర్చిని ఎగుమతి చేస్తుంటారు.
ఈ ఏడాది కూడా సంక్రాంతి నుంచి కొత్త పంట చేతికొచ్చింది. ఆ సరుకుని విక్రయించేందుకు రైతులు మార్కెట్ కు తీసుకు వస్తున్నారు. విదేశీ మార్కెట్ల నుంచి డిమాండ్ కారణంగా సీజన్ మొదట్లో 20వేలకు పైగానే పలికింది. అయితే.. వారం రోజులుగా పరిస్థితి మారిపోయింది. మేలు రకం తేజా మిర్చి.. క్వింటా 13వేల 500కు పడిపోయింది. మిగతా రకాలు 12వేల రూపాయలు పలుకుతున్నాయి. ధరలు పడిపోవటంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వైరస్ కారణంగా దిగుబడులు కూడా భారీగా తగ్గాయి. తాలు కాయలు ఎక్కువగా వచ్చాయి. ఇపుడు ధరలు కూడా పడిపోవటం వారిలో ఆందోళన కలిగిస్తోంది.