తూర్పుగోదావరి జిల్లాలోని కేంద్రపాలిత యానాంలో పెరుగుతున్న రోగుల సంఖ్యతోపాటు కోలుకుని ఇంటికి వెళ్తోన్న వారి సంఖ్య సైతం ఎక్కువగానే ఉంది. కానీ వీరంతా మరో 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండటం ఇబ్బందికరంగా మారింది. ఒకటి లేదా రెండు గదులు మాత్రమే ఉండే ఇంటిలో ఇది సాధ్యపడడం లేదు. కరోనా బాధితులు పడే కష్టాలను గమనించిన అగ్నికుల క్షత్రియ సేవా సంఘం తమ కళ్యాణ మండపాన్ని కోవిడ్ బాధితులకు పునరావాస కేంద్రంగా తీర్చిదిద్దింది.
క్వారంటైన్ కేంద్రంగా అగ్నికుల క్షత్రియ సేవా సంఘం పెళ్లిమండపం
కరోనా మహమ్మారి మానవసంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది... కరోనా సోకింది అని తెలిస్తే వృద్ధులైన తల్లిదండ్రులను తమ పేగు తెంచుకు పుట్టిన బిడ్డలే బయట పెట్టేస్తుండగా.. బంధు వర్గం కూడా ఆమడ దూరంలో ఉంచుతోంది.. ఇక అద్దె ఇంట్లో ఉంటున్న వారి బాధలు అయితే అన్నీ ఇన్నీ కావు. అద్దెకుంటున్న వారికి కరోనా సోకింది అని తెలియగానే యజమానులు ఇంట్లోకి రానివ్వకపోవటం వంటి సంఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. ఈ విషయాలన్నీ గమనించిన అగ్నికుల క్షత్రియ సేవా సంఘం మానవత్వంతో ముందుకొచ్చింది.
కరోనా బాధితులకు పునరావాస కేంద్రంగా అగ్నికుల క్షత్రియ సేవా సంఘం పెళ్లిమండపం
సుమారు 40పడకలు పురుషులకు, స్త్రీలకు వేరువేరుగా మంచాలు ఏర్పాటు చేయడంతో పాటు అక్కడుండే 14 రోజులు ఉచితంగా పౌష్టికాహారం అందించనున్నారు.. అందుకయ్యే పూర్తిగా ఖర్చులన్నీ సంఘమే భరించనుంది. వేలకు వేలు అద్దెలు తీసుకునే ఇంటి యజమానులు కనీసం మానవత్వం చూపకుండా వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ అగ్నికుల క్షత్రియ సేవా సంఘం చూపుతున్న సేవాభావాన్ని స్థానిక నాయకులు, కరోనా బాధితుల కుటుంబ సభ్యులు అభినందిస్తున్నారు.