చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో ఆగస్టు 15న ఓ వ్యక్తి మాంసపు దుకాణం నిర్వహిస్తున్నాడని పలువురు భాజపా నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై దుకాణ నిర్వాహకుడు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఫిర్యాదుదారులపై చేయి చేసుకున్నందున గురువారం ఇరువర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గాయపడ్డ తమ కార్యకర్తలు, నాయకులను పరామర్శించేందుకు భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాను ప్రకాష్ రెడ్డి, పలువురు రాష్ట్ర స్థాయి భాజపా నాయకులు వెళ్లే క్రమంలో పలమనేరు వద్ద గంగవరం పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
తమ కార్యకర్తలు నాయకులపై దాడి జరిగి సుమారు 24 గంటలు గడుస్తున్నా ఇప్పటివరకు బాధ్యులను అరెస్టు చేయకపోవడం దారుణమని, గాయపడ్డ వారిని పరామర్శించేందుకు వెళుతున్న తనను అడ్డగించి పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికం అని భాను ప్రకాష్ అన్నారు. కాగా వీకోటలో ప్రత్యేక సెక్షన్ అమలులో ఉన్నందున... శాంతిభద్రతల దృష్ట్యా భాజపా నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశామని సీఐ రామకృష్ణ వివరించారు.