పండ్లు.. కూరగాయల రైతులకు శుభవార్త
రైతులకు మేలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో కూరగాయలు, పండ్లకు ఫీజుల నుంచి మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో కూరగాయలు, పండ్లకు ఫీజుల నుంచి మినహాయింపులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల పండ్లు, కూరగాయలు సాగు చేసే రైతులకు లబ్ధి చేకూరనుంది. 1968 వ్యవసాయ మార్కెట్ చట్టం ప్రకారం వీటి క్రయ, విక్రయాలపై ఒక శాతం సుంకాన్ని వ్యవసాయ మార్కెట్లు వసూలు చేస్తున్నాయి. సుంకం మినహాయించటం వల్ల రైతులు నేరుగా కూరగాయలు, పండ్లు రాష్ట్రంలో ఎక్కడికైనా తీసుకెళ్లి విక్రయించుకోవచ్చు. మార్కెట్ కమిటీలకు ఎటువంటి సుంకం చెల్లించాల్సిన అవసరం ఉండదు. వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలోని చెక్పోస్టుల వద్ద తనిఖీలు, సిబ్బందికి మామూళ్లు వంటి ఇబ్బందులు ఉండవు. దీనికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలను మార్కెటింగ్ శాఖ జారీ చేసింది. మార్కెట్ కమిటీ యార్డుల వద్ద స్వేచ్ఛా వాణిజ్యం నిర్వహిస్తే మాత్రం ఒక శాతం సెస్సు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. కొనుగోలు మొత్తంలో ఒక శాతం సెస్సును కొనుగోలుదారు మార్కెట్ కమిటీకి చెల్లించాలని ఉత్తర్వులో పేర్కొంది.