ప్రభుత్వానికి నేనే సమస్యగా మారానేమో!?: చంద్రబాబు
కుప్పం పర్యటనలో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబు కార్యకర్తల భేటీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైకాపాకు నేనే సమస్యగా మారానేమోనన్న ఆయన... ప్రజా సంక్షేమం కాకుండా నామీద కేసులు పెట్టడం పైనే దృష్టిసారించారని ఆరోపించారు.
చిత్తూరు జిల్లా శాంతిపురం కార్యకర్తల భేటీలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజావేదిక ఎందుకు కూల్చేశారో వారికే అర్థం కావటం లేదని అన్నారు. నన్ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవటమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. వైకాపాకు నేనే సమస్యగా మారానేమో అని వ్యాఖ్యానించారు. నేనుండే ఇల్లు, నా వ్యక్తిగత భద్రతపై దృష్టి పెట్టినట్లు ఉన్నారని... నా మీద 30 అంశాల్లో అంతర్గత విచారణ వేశారని అన్నారు. నాపై ఇంకా ఏదీ దొరకలేదని అప్పటి మంత్రులపైనా ఆగ్రహించే పరిస్థికి వచ్చారని ఎద్దేవా చేశారు. ప్రజా సంక్షేమం కాకుండా నా మీద కేసులు పెట్టేందుకు ఇలా చేస్తున్నారని ఆరోపించారు. రెండు మండలాల్లో పర్యటన ముగించుకున్న ఆయన కుప్పం చేరుకున్నారు. రేపు గుడిపల్లె, కుప్పం మండలాల్లో పర్యటించనున్నారు.