పెన్నా యాజమాన్యంపై ఆగ్రహం.. యువకుడి ఆత్మహత్యాయత్నం
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఊరుచింతలలో గనుల తవ్వకాలపై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. పెన్నా సిమెంట్ యాజమాన్యం 69.96 హెక్టార్లలో ఈ కార్యక్రమం చేపట్టనుంది. ఈ సందర్భంగా కాలుష్యనియంత్రణ మండలి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పెన్నా సిమెంట్ యాజమాన్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి కల్పనలో అనుసరిస్తున్న వైఖరి దుయ్యబట్టారు. సాగు చేసే భూములు కోల్పోయిన తమకు ఉపాధి, ఉద్యోగ కల్పనలో యాజమాన్యం విఫలమైందని వాపోయారు. విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు మాత్రమే కల్పించి చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. పెద్దిరాజు అనే ఎంబీఏ పూర్తి చేసిన యువకుడు వేదికపైకి వచ్చి మాట్లాడుతూ 3ఏళ్లు తిరిగినా తనకు ఉద్యోగం ఇవ్వలేదని ఆవేదన చెందాడు. తనతో తెచ్చుకున్న విష ద్రావకాన్ని తాగేశాడు. స్థానికులు వెంటనే స్పందించి ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. సమస్యలన్నీ విన్న కర్మాగారం టెక్నికల్ డైరెక్టర్ లక్ష్మీకాంతం... యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా యాజమాన్యంతో చర్చిస్తానన్నారు.
పెన్నా యాజమాన్యంపై ఆగ్రహం... యువకుడి ఆత్మహత్యాయత్నం
.