అనంతపురంలో ఎస్ఎస్బిఎన్ ఎయిడెడ్ కళాశాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం విద్యార్థులు ఆందోళన చేయగా నిలువరించేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం మీడియా సమావేశం నిర్వహించింది. విద్యార్థుల ఆందోళన విషయాన్ని తామే పోలీసులకు చెప్పామని కళాశాల కార్యదర్శి నిర్మల తెలిపారు. విలీనం అయినందున ఫీజులు పెంచక తప్పదని స్పష్టం చేశారు. నాలుగున్నర వేలు ఉండే ఫీజును 20వేలు చేయాలని ప్రభుత్వమే చెప్పినప్పటికీ... 9వేలు మాత్రమే వసూలు చేస్తున్నట్టు ఆమె వివరించారు.
మీడియా సమావేశం జరుగుతుండగా అక్కడికి చేరుకున్న కళాశాల గవర్నింగ్ సభ్యుడు విఠల్ ఛైర్మన్, కార్యదర్శి ఏకపక్ష విధానాన్ని ఎండగట్టారు. ఫీజుల పెంపుపై గవర్నింగ్ సమావేశమూ నిర్వహించలేదన్నారు. 700 కోట్ల రూపాయల ఆస్తులు, కోట్ల నగదు నిల్వలు ఉన్న కళాశాలలో ఫీజులు పెంచకుండానే పేద విద్యార్థులకు చదువు చెప్పవచ్చన్నారు.