రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయడం రైతులను వంచించడమేనని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ... ఏపీ రైతు సంఘం పోరాట సమన్వయ కమిటీ అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన రైతు సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ బిల్లుల వల్ల కలిగే నష్టంపై ఆయన ఘాటుగా స్పందించారు. వ్యవసాయం అన్నది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్నా.. కేంద్రం ఏమాత్రం చర్చించకుండా ఏకపక్షంగా బిల్లులు తీసుకొచ్చిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 22, 68జీవోలు రద్దు చేయాలని శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు.
అమరావతిలో రైతులు 300 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వర్షాలకు నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.