నూతన విద్యా విధానాన్ని రద్దు చేసి అంగన్వాడీ సెంటర్లను బలోపేతం చేయాలని అనంతపురం జిల్లా పెనుకొండలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తహసీల్దార్ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా సీఐటీయూ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ.. కార్మికులను కట్టుబానిసల్లాగా మార్చే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.
పాలకొండలో...
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా శ్రీకాకుళం జిల్లా పాలకొండలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి దావాల రమణారావు మాట్లాడుతూ.. ఆహార భద్రతకు నష్టం చేసే 3 వ్యవసాయ నల్ల చట్టాలు, కేంద్ర విద్యుత్ సవరణ చట్టం, కార్మికులను కట్టుబానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
మైలవరంలో...
కృష్ణాజిల్లా మైలవరంలో కేంద్రప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజీల్ ధరలు కొండెక్కి సామాన్యుల జీవితాల్ని కష్టతరంగా మార్చాయని సీఐటీయూ మండల కార్యదర్శి చాట్ల సుధాకర్ తెలిపారు.