ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 1, 2022, 4:03 PM IST

ETV Bharat / state

ఊరంతా ఒక్కటై.. ఓడిన చోటే గెలిచారు..

వారంతా వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు. కరవు పరిస్థితుల కారణంగా సాగుకు దూరమయ్యారు. ఆ తర్వాత పాడి పరిశ్రమవైపు అడుగులేశారు. అందులోనూ కష్టాలు తప్పలేదు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాలు అమ్మడానికి వేరొకరిపై ఆధారపడటమేంటని భావించి.. సొంతగా పాల విక్రయం మొదలుపెట్టారు. ఊరంతా సంఘటితమై.. పాల వ్యాపారం కొనసాగించారు. పాలతో ఇతర పదార్థాలు కూడా తయారుచేసి అమ్ముతూ.. ఓడిన చోటే గెలిచి చూపించారు. వారే అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి రైతులు.

chennampalli farmers succes story
అనంతపురం జిల్లా చెన్నంపల్లి రైతుల విజయగాధ

అనంతపురం జిల్లా పేరు చెప్పగానే తీవ్ర వర్షాభావం, కరవు పరిస్థితులు గుర్తొస్తాయి. ఏ పంట వేసినా నష్టాలు తప్ప.. లాభాలు పొందే రైతులు తక్కువే. బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి రైతులు కూడా అందరిలాగే వ్యవసాయంలో నష్టపోయారు. సాగుతో నష్టాలు వచ్చినా పాడిని నమ్ముకోవడంతో.. వారికది ప్రధాన జీవనాధారంగా మారింది. దశాబ్దం క్రితం పశుపోషణ ప్రారంభించిన చెన్నంపల్లి రైతులు.. తొలిరోజుల్లో పాల వ్యాపారుల దోపిడీకి గురయ్యారు.

అనంతపురం జిల్లా చెన్నంపల్లి రైతుల విజయగాధ

వ్యాపారుల దయాదాక్షిణ్యాలపై పాలు విక్రయించుకునే పరిస్థితి ఉండేది. ఇలాంటి సమస్యలతో నష్టపోయిన గ్రామ రైతులంతా సొంతంగా పాల ఉత్పత్తులు తయారుచేసి అనంతపురంలో విక్రయించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇలా ప్రస్థానం ప్రారంభించి ఏడాది పొడవునా ఉపాధి పొందుతున్నారు. చెన్నంపల్లిలో దాదాపు వెయ్యి కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీరిలో సుమారు 600 కుటుంబాలు కేవలం పశుపోషణే ప్రధాన వృత్తిగా జీవిస్తున్నాయి. వీరంతా కలిసి 3,200కు పైగా గేదెలు, జెర్సీ ఆవులను పోషిస్తున్నారు.

గతంలో వేరుశెనగ, మొక్కజొన్న సాగుచేస్తున్న భూములన్నీ ప్రస్తుతం పశుగ్రాసం సాగుతో ఏడాదంతా పచ్చగా ఉంటున్నాయి. విక్రయించగా మిగిలిన పాలతో.. పన్నీర్, పాలకోవా, పెరుగు, నెయ్యి తదితర ఉత్పత్తులు తయారు చేసి.. రెస్టారెంట్లకు అమ్ముతున్నారు. ఈ గ్రామం నుంచి రోజూ 80 నుంచి వంద కిలోల పన్నీర్‌ సరఫరా అవుతోంది. చుట్టుపక్కల పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఎక్కడ జరిగినా.. క్యాటరింగ్ గుత్తేదారులకు ఇక్కడి నుంచే పాల ఉత్పత్తులు సరఫరా అవుతున్నాయి. వీటి వల్ల తమ ఆదాయం పెరిగిందని పాడి రైతులు ఆనందపడుతున్నారు. అయితే.. పాడి పరిశ్రమే జీవనాధారంగా ఉన్న చెన్నంపల్లికి.. పశువైద్యుడే లేడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువైద్యుడి నియామకంతోపాటు.. రుణాలు ఇప్పించాలని పాడి రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: Oilmill Owner Suicide: విజిలెన్స్ అధికారుల వేధింపులు.. కడపలో నూనె మిల్లు యజమాని ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details