ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సీలేరులో పంప్డ్​ స్టోరేజ్​ ప్రాజెక్టు.. నేడు ప్రజాభిప్రాయ సేకరణ

By

Published : Apr 1, 2023, 11:56 AM IST

Public Consultation On Pumped Storage Project: సీలేరులో ప్రభుత్వం చేపడుతున్న పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుపై నేడు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టునున్నారు. దీని కోసం ఏపీ జెన్​కో యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది.

Public consultation on pumped storage project
Public consultation on pumped storage project

Public Opinion On Pumped Storage Project: రాష్ట్ర ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరులో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుపై కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నేడు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు. దీని కోసం ఏపీ జెన్​కో యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. సీలేరు సమీపాన పార్వతీ నగర్ వద్ద 1350 మెగావాట్ల పంప్డ్​ స్టోరేజీ ప్రాజెక్టు నిర్మించడానికి ఏపీ జెన్కో నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను కేంద్ర ప్రభుత్వానికి అందజేశారు. ఈ మేరకు పంప్డ్​ స్టోరేజ్​ ప్రాజెక్టుపై పర్యావరణ అభ్యంతరాలు కోసం శనివారం సీలేరులో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు.

ప్రజాభిప్రాయ సేకరణకు వేదికైన ఫుట్​బాల్ మైదానం: స్థానిక ఫుట్​బాల్​ క్రీడా మైదానంలో వేదికను ఏర్పాటు చేశారు. సుమారు మూడు వేల మందికి సరిపోయే విధంగా గ్యాలరీ తయారు చేశారు. ధారకొండ, దుప్పిలవాడ, సీలేరు పంచాయతీల పరిధిలో కాలుష్య నియంత్రణ మండలి సూచించిన సుమారు 22 గ్రామాలు ప్రజలు ఈ సేకరణకు హాజరయ్యే అవకాశం ఉండటంతో.. అందుకు అవసరమయిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఎస్ఈ KKV ప్రశాంత్ కుమార్, ఈఈ ప్రభాకర్, బాలకృష్ణ, బాబూరావులు వేదిక ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారు.

వైద్య శిబిరం, తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు: శుక్రవారం సాయంత్రం ఏపీ జెన్​కో కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ముఖ్య ఇంజనీర్లు సుజయ కుమార్, శేషారెడ్డి, ఎస్ఈ రవీంద్రనాథ్​రెడ్డిలు సీలేరు చేరుకుని ఏర్పాట్లును పరిశీలించారు. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులకు సీఈలు సూచించారు. ముఖ్యంగా ఎక్కడికక్కడ మంచినీటి సదుపాయం ఏర్పాట్లు చేయాలని, అదే విధంగా వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.

భారీ భద్రత ఏర్పాట్లు:ప్రజాభిప్రాయ సేకరణ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని సీఐ జి.అశోక్ కుమార్ తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ జరిగే వేదిక వద్ద ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఈ కార్యక్రమం ప్రశాంతంగా జరగడానికి అవసరమైన ఏర్పాట్లు చేశామని, వేదిక వద్ద, చుట్టుపక్కల సాయుధ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా మెటల్ డిక్టేటర్​తో తనిఖీలు నిర్వహిస్తామని సీఐ తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details