ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

తెలంగాణ: రెండు రోజుల్లో 15 సైబర్​ కేసులు నమోదు

కరోనా వైరస్​తో ప్రపంచం అతలాకుతలమవుతుంటే.. సైబర్ నేరస్థులు మాత్రం కాసుల కోసం అమాయకులకు వల వేస్తున్నారు. పీఎం కేర్స్​కు విరాళాలతో పాటు, మందుబాబుల కోసం మద్యం ఇంటి వద్దకే తెచ్చిస్తామంటూ ఆశ చూపుతున్నారు. వీటితో పాటు ఈఏంఐలు, లాక్​డౌన్​పై వదంతులు వ్యాప్తి చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రెండు రోజుల వ్యవధిలోనే తెలంగాణలో సైబర్​ నేరాలపై 15 ఫిర్యాదులు వచ్చాయి.

By

Published : Apr 5, 2020, 12:24 PM IST

15-cyber-crime-cases-registered-in-last-2-days
15-cyber-crime-cases-registered-in-last-2-days

విపత్తు వేళ సాటి మనుషులను ఆదుకోవాలంటూ విరాళాలివ్వాలని.. మందు పార్టీలకు అవసరమైన మద్యాన్ని ఇంటికే తీసుకొస్తామంటూ కొందరు ఫోన్లు చేస్తున్నారు. ఫేస్​బుక్, వాట్సాప్​లలో ప్రకటనలిస్తున్నారు. స్పందించిన వారి నుంచి నగదు బదిలీ చేసుకుంటున్నారు.

సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు..

ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇవ్వాలంటూ సైబర్ నేరస్థులు పీఎం కేర్స్ పేరుతో నకిలీ యూపీఐలను ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్​లలో ప్రకటనలు గుప్పిస్తున్నారు. యూపీఐలను స్పష్టించిన సైబర్ నేరస్థుల్లో ఒకరు హైదరాబాద్ యువకుడు అఖిల్​గా పోలీసు అధికారులు గుర్తించారు. ఆన్​లైన్​లో ఆర్డర్ ఇస్తే... ఇంటికే మద్యం అందజేస్తామంటూ రాజస్థాన్, బిహార్​కు చెందిన నేరస్థులు ఇప్పటికే లక్షల్లో నగదు బదిలీ చేసుకున్నారు. మందుబాబులు తమ ప్రకటనలను నమ్మేందుకు వీలుగా స్థానికంగా ఉన్న మద్యం దుకాణాల పేర్లు పోస్ట్ చేస్తున్నారు.

లాక్​డౌన్​ పొడిగిస్తారంటూ..

వీటితో పాటు నెలవారీ ఈఎంఐలు ఎలా వాయిదా వేసుకోవాలో సంప్రదించాలంటూ ఈ-మెయిళ్లు పంపుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఒక వర్గానికి వ్యతిరేకంగా కొందరు సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. వీటిని పరిశీలించిన సల్మాన్ ఖాన్ అనే యువకుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వైరస్ ప్రబలుతుందని కొందరు వీడియోలను యూట్యూబ్​లో ఉంచారు. లాక్​డౌన్​ను కూడా మే 4 వరకు పొడిగిస్తారంటూ మరికొందరు సోషల్​ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

కఠిన చర్యలు..

రెండు రోజుల వ్యవధిలో తెలంగాణలో 15 కేసులు నమోదు చేశామని సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. ఆన్​లైన్​లో మద్యం, మోదీకి విరాళాలంటూ వచ్చే ప్రకటనలు నమ్మకూడదని సూచించారు. కరోనా పేరుతో మోసపూరిత ప్రకటనలు ఇస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఇవీ చూడండి:25 సెకన్లలో శరీరంపై ఉన్న క్రిములన్నీ కడిగేస్తుంది!

ABOUT THE AUTHOR

...view details