అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
విశాఖ అక్కయ్యపాలెంలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విశాఖలో బీటెక్ చదువుతున్న ఒక యువతి అక్కయ్యపాలెంలోని ఓ అపార్ట్మెంట్లో ఉరి వేసుకుని మృతి చెందింది. మల్కాపురం ప్రాంతం ప్రకాష్ నగర్కి చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. లెక్చరర్ కిష్లే గదిలో యువతి మరణించింది. విధులు ముగించుకుని అపార్ట్మెంట్కు వచ్చిన కిష్లే తలుపులకు గడి వేసి ఉండటంతో విరగ్గొట్టి చూసేసరికి ఆమె ఉరి వేసుకుని మృతి చెందింది . లెక్చరర్ పోలీసు స్టేషన్కు వెళ్లి సమాచారం అందించారు. తనని ప్రేమిస్తున్నానంటూ వెంటపడేదని లెక్చరర్ పోలీసులకు వివరణ ఇచ్చాడు. ఇదే విషయాన్ని యువతి తల్లిదండ్రులకు గతంలో సమాచారమిచ్చినట్లు పోలీసులకు తెలిపారు. పోలీసులు చుట్టు పక్కల వారిని విచారించగా... యువతి అప్పుడప్పుడు అపార్ట్మెంట్కు వచ్చి వెళ్లేదని వాచ్మెన్ తెలిపారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. యువతి మృత దేహం పోస్టుమార్టానికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతి పట్ల ఉన్న అనుమానాలు బయటపడతాయని పోలీసులు తెలిపారు.