ప్రయాణికుల రద్దీ దృష్ట్యా జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు సికింద్రాబాద్, తిరుపతి, భువనేశ్వర్లకు విశాఖ, దువ్వాడల మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. వారానికి ఒకసారి ఈ రైలు సర్వీసులు నడుస్తాయి. భువనేశ్వర్ - సికింద్రాబాద్ ఏసీ వీక్లీ రైలు, జనవరి రెండు నుంచి మార్చి 26 వరకు... దువ్వాడ మీదుగా నడుస్తుంది. భువనేశ్వర్లో ప్రతీ గురువారం మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు బయలుదేరి, రాత్రి తొమ్మిది గంటల 17 నిమిషాలకు దువ్వాడ చేరుతుంది. మరుసటి ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. తిరుగు మార్గంలో శుక్రవారం రాత్రి 9.30 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటల 38 నిమిషాలకు దువ్వాడ చేరుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. ఏసీ త్రీ టైర్ బోగీలతో ఈ ప్రత్యేక రైలు నడుపుతారు.
సికింద్రాబాద్ - విశాఖల మధ్య వీక్లీ రైలు జనవరి 7వ తేదీ నుంచి నడుపుతారు. ఈ రైలు విశాఖలో రాత్రి 11 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణం అదేరోజు సాయంత్రం 4.30 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి... తెల్లవారుజామున 4.50 గంటలకు విశాఖ చేరుతుంది. స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ బోగీలు, ఆరు జనరల్ బోగీలు ఉంటాయి. విశాఖ - తిరుపతిల మధ్య నడిచే రైలు ప్రతి శనివారం రాత్రి 10.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు తిరుపతి చేరుతుంది. అదేరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుగు ప్రయాణమై... బుధవారం ఉదయం 6.50 నిమిషాలకు విశాఖకు వస్తుంది.