మిసెస్ ఏవీఎన్ కళాశాల మాజీ కరస్పాండెంట్, ప్రస్తుత ఛైర్పర్సన్ అంకితం ఇంద్రాణి జగ్గారావు(85) కన్ను మూశారు. విశాఖలోని వాల్తేరు అప్ల్యాండ్స్ దీపాంజలి ఆపార్టుమెంట్లోని ఆమె స్వగృహంలో ఆదివారం ఆమె తుది శ్వాస విడిచారు. విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేసి బాటలు వేసిన ఈమె... మహిళల సమస్యలపైనా అలుపెరగని పోరాటం చేశారు. సాంఘిక దురాచారాలపై ఉక్కుపాదం మోపేందుకు అహోరాత్రులు శ్రమించారు. దేశ ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఘనత ఈమె సొంతం.
ఏవీఎన్ కళాశాల అభివృద్ధికి విశేష కృషి
1934 సెప్టెంబరు 24న పశ్చిమబంగాల్ రాష్ట్రంలో సంపన్న కుటుంబంలో ఇంద్రాణి జన్మించారు. ఈమె తండ్రి సమరేంద్ర గుప్తా డిప్యూటీ ఆడిటర్ జనరల్గా దేశానికి సేవలందించారు. దిల్లీ యూనివర్శిటీ నుంచి ఈమె ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ పట్టా పొందారు. విశాఖ నగరంలో పేరు గాంచిన అంకితం కుటుంబానికి చెందిన ఏవీఎన్ జగ్గారావును వివాహం చేసుకొని అక్కడే స్థిరపడ్డారు. ఆమెకు ఇద్దరు కుమారులు. సర్ సీవీ రామన్, కొంగర జగ్గయ్య, ఎస్వీ రంగారావు వంటి మహానుభావులను అందించిన ఏవీఎన్ కళాశాల అభివృద్ధిలో ఈమె పాత్ర మరువలేనిది. అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. అప్పటి వరకు ఉన్న సంప్రదాయ కోర్సుల స్థానంలో సాంకేతిక కోర్సులు ప్రవేశపెట్టారు. 1964లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో చేరినప్పటి నుంచి ఆమె సంఘ సేవకురాలిగా, మహిళాభ్యుదయవాదిగా, సంఘ సంస్కర్తగా సేవలు ప్రారంభించారు.
● వయోజన విద్య కోసం ముఖ్యంగా గ్రామీణ మహిళల అక్షరాస్యత కోసం విశేష కృషి చేశారు. వందలాది రాత్రి శిబిరాలు ఏర్పాటు చేసి విద్యను అందించారు.
● అఖిల భారత మహిళా సంఘం అధ్యక్షురాలిగా, మహిళా దక్షత కమిటీ అధ్యక్షురాలిగా, ఉమ్మడి రాష్ట్ర హస్త కళల సలహా సంఘ సభ్యురాలిగా, కేజీహెచ్ సలహా మండలి సభ్యురాలిగా సేవలందించారు.
● ఎయిడ్స్ నివారణకు తన వంతు కృషి చేశారు. వరకట్నం, లైంగిక వేధింపులు, మహిళలపై దురాగతాలను అడ్డుకునేందుకు పాటు పడ్డారు.