ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 10, 2020, 8:39 PM IST

ETV Bharat / city

'విశ్వ విద్యాలయ అభివృద్ధిలో పూర్వ విద్యార్థులదే ప్రధాన భూమిక'

ఆంధ్ర విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సమ్మేళనం తొలిసారి వర్చువల్ విధానంలో జరిగింది. ఈ సమ్మేళనంలో కేంద్ర పర్యావరణం, అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏయూ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

AU Alumni meet
AU Alumni meet

ఆంధ్ర విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ఆంధ్ర విశ్వ విద్యాలయ వ్యవస్థాపకుడు కట్టమంచి రామలింగా రెడ్డి జన్మదినాన ఏటా పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహిస్తోంది విశాఖలోని ఆంధ్ర విశ్వ విద్యాలయ పూర్వ విద్యార్థుల సంఘం. ప్రతి సంవత్సరం ఘనంగా జరిగే ఈ వేడుకను... ఈసారి కొవిడ్ కారణంగా వర్చువల్ విధానంలో నిర్వహించారు. ఈ సమ్మేళనంలో కేంద్ర పర్యావరణం, అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ ముఖ్య అతిథిగా పాల్గొనగా, విశిష్ట అతిథులుగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ అదిమూలపు సురేష్, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆచార్య జయచంద్ర రెడ్డి పాల్గొన్నారు.
'నా వంతు సహకారం అందిస్తా'
ఈ దేశంలో పూర్వ విద్యార్థులే విశ్వ విద్యాలయ అభివృద్ధి భూమికలుగా ఉన్నారని కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ అన్నారు. ఆంధ్ర విశ్వ విద్యాలయ పూర్వ విద్యార్థులు మంచి పని చేస్తున్నారని ప్రశంసించారు. ప్రతి విశ్వ విద్యాలయం, పాఠశాలల్లో పూర్వ విద్యార్థుల సంఘాలు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఏయూ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అభివృద్ధికి ప్రణాళిక

విశ్వ విద్యాలయాల అభివృద్ధి వెనుక పూర్వ విద్యార్థుల సంఘం కృషి ఉంటుందన్నారు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. తదుపరి తరానికి విశ్వ విద్యాలయ ఫలాలు ఇవ్వడానికి పూర్వ విద్యార్థుల సంఘాలు పని చేస్తున్నాయని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య అభివృద్ధికి కృషి చేస్తోందని ఆయన వెల్లడించారు. ఆంధ్ర యూనివర్సిటీ సర్ సీఆర్​ఆర్​ రెడ్డి, సర్వేపల్లి రాధాకృష్ణ వంటి గొప్ప వ్యక్తుల కలలు నెరవేర్చుతుందని మంత్రి ప్రశంసించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం 94 సంవత్సరాలుగా ఎందరో జాతి ముద్దు బిడ్డలను అందించిందని ఉపకులపతి ఆచార్య పీవీజీడీ ప్రసాద్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో కేంద్ర విద్యా పాలసీని అమలు చేస్తూ మరింత విద్యా ప్రగతి సాధిస్తుందని చెప్పారు. రాబోయే మూడేళ్లలో అభివృద్ధి అడుగులు వేసేలా ప్రణాళిక వేసుకున్నట్టు చెప్పారు.

ఏయూ పూర్వ విద్యార్థుల సంఘ అధ్యక్షుడు ఆచార్య బిలా సత్యనారాయణ ప్రారంభ ఉపన్యాసం చేశారు. పూర్వ విద్యార్థుల సంఘ కూర్పుతో చేసిన స్వాగత గీతంతో సమావేశాన్ని ప్రారంభించారు. వేలాది మంది విద్యార్థులు వర్చువల్​గా సమ్మేళనంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి

రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి ఎవరు..?

ABOUT THE AUTHOR

...view details