ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉత్తర కాలిఫోర్నియాలో.. "సిలికానాంధ్ర మనబడి" స్నాతకోత్సవం!

ఉత్తర కాలిఫోర్నియాలో" సిలికానాంధ్ర మనబడి" స్నాతకోత్సవం వైభవంగా జరిగింది. మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. అమెరికాలో తెలుగు భాషాభివృద్ధికి సిలికానాంధ్ర మనబడి చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.

By

Published : Jul 11, 2022, 9:36 PM IST

సిలికానాంధ్ర మనబడి స్నాతకోత్సవం
సిలికానాంధ్ర మనబడి స్నాతకోత్సవం


ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్ పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని డాక్టర్ లక్కిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో.. "సిలికానాంధ్ర మనబడి" స్నాతకోత్సవం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా.. బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. అమెరికాలో అధిక సంఖ్యలో మాట్లాడే మొదటి 20 భాషల్లో తెలుగు చోటు చేసుకోవడమే కాకుండా.. అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న భాషగా రూపుదిద్దుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అమెరికాలో తెలుగు భాషాభివృద్ధికి సిలికానాంధ్ర మనబడి చేస్తున్న కృషిని అభినందించారు. పదిహేను సంవత్సరాల్లో 75 వేల మందికి తెలుగు నేర్పడం ఒక అద్భుత విజయంగా అభివర్ణించారు.

సిలికానాంధ్ర మనబడి స్నాతకోత్సవం

15 సంవత్సరాలుగా విదేశాల్లో పుట్టి పెరుగుతున్న పిల్లలకు ప్రణాళికాబద్ధంగా తెలుగు భాషను నేర్పుతూ WASC (అమెరికా సంస్థ) గుర్తింపు పొందిన ఏకైక విద్యాసంస్థ 'సిలికానాంధ్ర మనబడి' మాత్రమేనని ఆ సంస్థ అధినేత శ్రీ చమర్తి రాజు గుర్తు చేశారు. సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిబొట్ల ఆనంద్ మాట్లాడుతూ.. ఈ విజయం వెనుక ఉన్న 2,500 మంది భాషా సైనికుల స్వచ్ఛంద సేవను, అమెరికాలో పుట్టిన పిల్లలకు తెలుగు భాష నేర్పిస్తున్న తల్లిదండ్రులను అభినందిస్తున్నానని అన్నారు.

సిలికానాంధ్ర మనబడి స్నాతకోత్సవంలో ప్రసంగిస్తున్న మండలి బుద్ధప్రసాద్

అనంతరం ఇదే వేదికపై.. ప్రఖ్యాత రంగస్థల కళాకారులు గుమ్మడి గోపాలకృష్ణ దర్శకత్వంలో "మనబడి" విద్యార్ధులు ప్రదర్శించిన "శ్రీకృష్ణ రాయభారం" పద్య నాటకం ఆకట్టుకుంది. ఈ నాటకంలో శ్రీ కృష్ణ పాత్రలో కుమారి సంజన తొడుపునూరి, దుర్యోధన పాత్రలో కుమారి కాట్రెడ్డి శ్రియ నటన.. అలరించాయి. దర్శకుడు గోపాలకృష్ణ మాట్లాడుతూ.. సిలికానాంధ్ర సంస్థతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

శ్రీ కృష్ణ పాత్రలో కుమారి సంజన తొడుపునూరి

మనబడి స్నాతకోత్సవానికి గంటి శ్రీదేవి, రాధా శాస్త్రి సమన్వయకర్తలుగా వ్యవహరించారు. ఈ సభ నిర్వహణకు.. సిలికానాంధ్ర కార్యకర్తలు కొండిపర్తి దిలీప్, కూచిబోట్ల శాంతి, కందుల సాయి, సంగరాజు దిలీప్, కోట్ని శ్రీరాం, తనారి గిరి, కస్తూరి ఫణిమాధవ్ కృషి చేశారు.

2022-23 ఏడాదికి సంబంధించి "మనబడి" విద్యా సంవత్సరం.. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి మొదలవుతుందని.. రిజిస్ట్రేషన్లు https://manabadi.siliconandhra.orgలో నమోదు చేసుకోవాలని కులపతి చమర్తి రాజు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: జగన్‌ది విశ్వసనీయత కాదు.. విషపునీయత: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details