దిల్లీలో నిరసన తెలుపున్న రైతులపై ప్రభుత్వం జరిపిన నిర్బంధ చర్యలను నిరసిస్తూ విశాఖలో వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. నూతన వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తున్న రైతుల మీద, కేంద్రం లాఠీఛార్జీ జరిపించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశాయి. నగరంలోని మద్దిలపాలెం, జగదాంబ జంక్షన్ వంటి పలు ప్రాంతాల్లో కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అన్నదాతలకు న్యాయం చేయకపోతే కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
రైతులను అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు
న్యాయమైన హక్కుల సాధనకు ఉద్యమిస్తున్న రైతులను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్బంధించడాన్ని సీఐటీయూ తీవ్రంగా ఖండించింది. విశాఖ సీపీఎం కార్యాలయం నుంచి మద్దిలపాలెం ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ వరకు ర్యాలీగావెళ్లి, రాస్తారోకో నిర్వహించింది. రైతులకు నష్టదాయకమైన మూడు వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ నర్సింగరావు అన్నారు. దేశవ్యాప్తంగా రైతాంగం ఈ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతోందని స్పష్టం చేశారు.
తమ డిమాండ్ల సాధనకు 500 సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు పంజాబ్, హరియాణ, ఉత్తరప్రదేశ్ రైతులు దిల్లీకి పయనమయ్యారని, వారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోందన్నారు. దిల్లీ, హరియాణ సరిహద్దులో అన్నదాతల మీద టియర్ గ్యాస్ వినియోగించడం దారుణమని నర్సింగరావు ఆవేదన వ్యక్తం చేశారు. లాఠీఛార్జి చేయడాన్ని ఆయన ఖండించారు. భవిష్యత్తులోనూ కార్మికులు, కర్షకులు కలిసి ఐక్య పోరాటాలు సాగిస్తారని పెట్టుబడిదారీ విధానాన్ని తిప్పికొడతారని ఆయన హెచ్చరించారు.
కంచరపాలెం రైతు బజార్ వద్ద సిపిఎం నిరసన
రైతులను దిల్లీకి రాకుండా అడ్డుకున్నకేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా విశాఖ కంచరపాలెం రైతు బజార్ వద్ద సీపీఎం నిరసన ప్రదర్శన చేపట్టింది. శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళుతున్న రైతులపై దాడికి నిరసనగా దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోందని సీపీఎం నాయకుడు అప్పారావు అన్నారు. రైతులను దోపిడీ చేసేందుకు మూడు వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చారని విమర్శించారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేయడానికి 2020 ఎలక్ట్రికల్ చట్టాన్ని మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిందని, ఈ చట్టాలకు రాష్ట్రంలోని వైసీపీ, తెలుగుదేశం పార్టీలు మద్దతు ఇచ్చాయని మండిపడ్డారు.
అనంతపురంలో మానవహారం..
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులపై లాఠీఛార్జీ చేయడాన్ని నిరసిస్తూ అనంతపురం జిల్లా హిందూపురంలో సీఐటీయూ నాయకులు ర్యాలీ చేపట్టారు. మానవహారం నిర్వహించారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న కర్షకులపై కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడడం దారుణమని అన్నారు.