విజయవాడ నార్త్ జోన్ తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగుల మధ్య పోరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వరకూ వెళ్లింది. ఇటీవల ఇదే కార్యాలయంలో అవినీతి జరుగుతోందని... వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలను లంచాల కోసమే పెండింగ్లో పెడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అనిశా అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఆర్ఐ శివకృష్ణపై ఆరోపణలు వచ్చాయి. అయినా అతనిని బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు.
పోలీసుల వద్దకు రెవెన్యూ ఉద్యోగుల పంచాయితీ!
విజయవాడ నార్త్ జోన్ తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగుల మధ్య గొడవ పోలీసుల వద్దకు చేరింది. తనను ఆర్ఐ శివకృష్ణ, మరో వ్యక్తి వేధింపులకు గురి చేస్తున్నారని ఆ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న వరప్రసాద్.... సింగ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు చెప్పారు.
ఆర్ఐ శివకృష్ణ నార్త్ తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో శ్రీను అనే యువకుడిని అనధికారికంగా తన కింద నియమించుకున్నాడు. విషయం తహసీల్దార్ దృష్టికి వెళ్లటంతో శ్రీనును కార్యాలయంలోకి రావొద్దని ఆదేశించారు. ఈ విషయంపై తానే సమాచారం ఇచ్చానన్న అనుమానంతో సదరు ఆర్ఐ, ప్రైవేట్ ఉద్యోగి శ్రీను వేధింపులకు గురి చేస్తున్నారని కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న వరప్రసాద్.... సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా ఫోన్పే యాప్ ద్వారా తన ఖాతాలోకి నగదు వేస్తున్నారని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. ఆర్ఐ అవినీతిపై విచారణ చేయాలని... తనని చంపుతానని బెదిరిస్తున్న ప్రైవేట్ ఉద్యోగి శ్రీనుపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కూ ఫిర్యాదు చేసినట్లు బాధితుడు వర ప్రసాద్ చెప్పారు.